భాజపా, కాంగ్రెస్ కలిసే నాపైకి సీబీఐని: మాజీ సీఎం
న్యూఢిల్లీ: హర్యానా మాజీ ముఖ్యమంత్రి, టీచర్ల కుంభకోణంలో పదేళ్ల జైలు శిక్షకు గురైన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా శనివారం తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. కేవలం అధికార దాహంతోనే బీజేపీ, కాంగ్రెస్లు తనను లక్ష్యంగా చేసుకుని సీబీఐని తనపైకి ఉసిగొల్పాయని ఆయన ఆరోపించారు.
ఈ నెల 15న జరగనున్న ఎన్నికల్లో తన విజయం ఖాయమని భావించినందునే ఆ రెండు పార్టీలు తన బెయిల్ రద్దయ్యేలా వ్యవహరించాయన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన బహిరంగ సభలకు జనం పలుచగా కనిపించిన నేపథ్యంలోనే కేంద్రం సీబీఐని తనపైకి ఉసిగొల్పిందని చౌతాలా వ్యాఖ్యానించారు.
తాను జైలులో ఉన్నా, విజయం మాత్రం ఐఎన్ఎల్డీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనారోగ్య కారణాల రీత్యా తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆయనకు గతేడాది కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా అనారోగ్య కారణంగా బెయిల్ పొందిన ఈ మాజీ సీఎం, హర్యానాలో అక్టోబర్ 15న జరగనున్న ఎన్నికల కోసం తన పార్టీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న సీబీఐ, చౌతాలా బెయిల్ను రద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ను విచారించిన కోర్టు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేంతగా ఆరోగ్యం మెరుగై ఉంటే, తక్షణమే జైలులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.
బీజేపీతోనే అభివృద్ధి: ప్రధాని మోడీ
వారసత్వ రాజకీయాలకు, గుండా రాజ్యానికి హర్యానాలో తెరదించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీకి ఓటేయాలన్నారు. రాష్ట్రంలో కుటుంబపాలన పెరిగిపోయిందని, ప్రజలకు ఏమీ చేయని నేతలు వారి జేబులను నింపుకుంటున్నారని విమర్శించారు.
ఐదు కుటుంబాలు ఇప్పటివరకు రాష్ర్టాన్ని పాలించాయి. కానీ వారి కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి. ఐదేండ్లపాటు ఒక కుటుంబం అధికారంలో, మరొకరు ప్రతిపక్షంలో ఉండేలా తెరవెనుక ఒప్పందం కుదుర్చుకుంటూ రాష్ర్టాన్ని దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఈ గుండారాజ్యానికి, వారసత్వ పాలనకు తెరదించాలి అని సిర్సాలో శనివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోడీ అన్నారు.