తలవంపులు: అసెంబ్లీలో కొట్టుకున్న కాంగ్రెసు, బిజెపి ఎమ్మెల్యేలు
అహ్మదాబాదు: భారత ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చే సంఘటన బుధవారం చోటు చేసుకుంది. గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెసు, బిజెపి శాసనసభ్యులు పరస్పరం దాడులకు దిగారు.
సభలో మైక్రోఫోన్తో బిజెపి ఎమ్మెల్యేపై దాడి చేసినందుకు కాంగ్రెసు సవరకుండ్ల ఎమ్మెల్యే ప్రతాప్ దుధాత్ను స్పీకర్ రాజేంద్ర త్రివేది పూర్తి కాలం పాటు సస్పెండ్ చేశారు. కాంగ్రెసు ఎమ్మెల్యే గొడవకు దిగి వెల్లోకి దూసుకెళ్లారు.
తన పార్టీకి చెందిన జామ్నగర్ ఎమ్మెల్యే విక్రమ్ మాదాం పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తడానికి అనుమతించకపోవడంతో ఆయన ఆందోళనకు దిగారు బుధవారం ఉదయం నుంచి మాదాం పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఆయనకు ఇవ్వకుండా మరో కాంగ్రెసు ఎమ్మెల్యే దలింద శైలేష్ పర్మార్కు అవకాశం ఇచ్చారు. దాంతో మాదాం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. తన సహచరుడికి అవకాశం ఇచ్చే ఉద్దేశంతో పర్మార్ కూర్చున్నారు.
అయితే, మాదాంకు స్పీకర్ అనుమతి నిరాకరించారు. దాంతో కాంగ్రెసు శాసనసభ్యులు విర్జీ తుమ్మర్, అమ్రీష్ దేర్ వెల్లోకి దూసుకెళ్లారు. వాదనకు దిగారు. ఆ సమయంలో బిజెపి ఎమ్మెల్యేపై కాంగ్రెసు ఎమ్మెల్యే దాడి చేసారు.