ఎమ్మెల్యేలా.. సంతలో పశువులా... ముంబై హోటల్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల నిరసన, రంగంలోకి శివకుమార్
ముంబై/ బెంగళూరు : కర్ణాటకీయం క్షణ క్షణం మారుతుంది. ప్రభుత్వాన్ని కాపాడేందుకు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు శతవిధలా ప్రయత్నాలు చేస్తున్నారు. ముంబై హోటల్లో క్యాంపు నిర్వహిస్తోన్న ఎమ్మెల్యేలతో చర్చలు జరిపేందుకు రంగంలోకి దిగారు ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ మంత్రులు రాజీనామా చేయగా, తాము కూడా రిజైన్ చేస్తామని జేడీఎస్ మంత్రులు స్పష్టంచేశారు. దీంతో కర్ణాటక రాజకీయం ట్విస్టులతో చివరి దశకు చేరినట్టు అనిపిస్తోంది.
సర్వశక్తులు ..
కర్ణాటకలో తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సంకీర్ణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. 13 మంది ఎమ్మెల్యేలు ముంబై హోటల్లో క్యాంపు పెట్టడంతో .. వారితో చర్చించేందుకు సిద్ధమైంది. వారి డిమాండ్లపై ఇప్పటికే అంగీకరించిన కాంగ్రెస్ పార్టీ ... ఇంకా ఏమైనా ఉంటే చెప్పాలని డీకే శివకుమార్ను పంపించింది. వారితో శివకుమార్ సమావేశమై .. డిమాండ్లను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.
పశువుల సంతానా..?
మరోవైపు ముంబైలోని సోఫిటెల్ హోటల్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. గుర్రంపై యడ్యూరప్ప వేషధారనతో కూర్చొని నిరసన తెలిపారు. పశువులను సంతలో కొనుగోలు చేసినట్టు (హార్స్ ట్రేడింగ్), తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేశారనే అర్థం వచ్చేటట్టు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యేల వైఖరిని నిరసిస్తూ నినాదాలు కూడా చేశారు. భారీ బ్యానర్లు చేతపట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనతో హోటల్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు బెంగళూరులో కూడా కాంగ్రెస్ శ్రేణులు ఇదేవిధంగా ఆందోళన చేపట్టాయి. రాజీనామా చేసిన నేతలు స్పీకర్ను కలువాలే తప్ప ముంబైలో క్యాంపు వేయడం ఏంటి ప్రశ్నించారు.
అదనుచూసి ..
మరోవైపు పరిస్థితిని బీజేపీ నిశీతంగా గమనిస్తోంది. రానున్న రోజుల్లో మరికొంత మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడే అవకాశం ఉందని మాజీ సీఎం, కర్ణాటక బీజేపీ చీప్ యడ్యూరప్ప తెలిపారు. కర్ణాటకలో ప్రభుత్వం మైనారిటీలో పడిపోతుందని తెలిపారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాకు .. ఆ పార్టీ అధినేతల వైఖరి కారణమని గుర్తుచేశారు. కర్ణాటకలో బీజేపీ రోల్ ఏంటీ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా .. మరో రెండురోజులు వేచి చూస్తామని పేర్కొన్నారు. ఈ సమయంలో మరికొంత మంది ఎమ్మెల్యేలు చేజారుతురాని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే .. తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టంచేశారు.