ఎలక్టోరాల్ బాండ్ల పేరుతో భారీ స్కామ్: కాంగ్రెస్, అసలు వీటి కథ ఏంటి..?
న్యూఢిల్లీ: ఎలక్టొరాల్ బాండ్స్ అంశంపై పార్లమెంటు దద్దరిల్లింది. ఇలాంటి బాండ్లను ప్రవేశపెట్టి బహిరంగంగానే ప్రభుత్వం అవినీతికి తెరలేపిందని మండిపడింది కాంగ్రెస్. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పడంపై కూడా కాంగ్రెస్ సీరియస్గా రియాక్ట్ అయ్యింది. ఈ రెండు అంశాలను వ్యతిరేకిస్తూ నిరసనగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో ఆపార్టీ వాకౌట్ చేసింది. అసలు ఇంత రచ్చకు దారితీసిన ఎలక్టోరాల్ బాండ్స్ అంటే ఏమిటి..?
ఎలక్టోరాల్ బాండ్ అంటే వడ్డీలేని ప్రామిసరీ నోట్ లాంటిది
ఫైనాన్స్ బిల్లు 2017లో ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ను తొలిసారిగా పొందుపర్చారు. ఇది వడ్డీలేని ప్రామిసరీ నోట్ లాంటిది. ఈ బాండ్లను ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రతి త్రైమాసికానికి కొనుగోలు చేయొచ్చు. జనవరి 2, 2018లో నోటిఫై అయిన ఈ స్కీమ్ ఒక వ్యక్తిగానీ లేక ఒక దేశీయ సంస్థ కానీ ఆయా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వాలంటే రూ.1000, రూ.10వేలు, రూ. 1 లక్ష, రూ.10 లక్షలు, రూ. 1 కోటి రూపంలో ఉండే బాండ్లను ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని 15 రోజుల్లోగా రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక బాండ్లను కొనుగోలు చేసేవారు పూర్తి వివరాలతో కూడిన కేవైసీని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఎలక్టోరల్ బాండ్లను ఆయా రాజకీయపార్టీలకు ఇస్తున్నారో వారి వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. రహస్యంగానే ఉంచొచ్చు.
ఎలక్టోరాల్ బాండ్లు ఎలా సహాయపడుతాయి...?
ఎలక్టోరాల్ బాండ్లను ప్రవేశపెట్టడమంటే ఎన్నికల సంస్కరణల్లో ఒక పెద్ద ముందడుగు వేసినట్లే అని కేంద్రం చెప్పుకొచ్చింది. అయితే ఈ బాండ్లు ద్వారా పారదర్శకతతో పాటు జవాబుదారీతనం కూడా ఉంటుందని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరించింది. ఎలక్టోరాల్ బాండ్స్ ద్వారా ప్రభుత్వం అవినీతికి తెరలేపిందని చెబుతూ, అదే సమయంలో ఎవరు ఎంత విరాళాలు ఇచ్చారో దాచే ప్రయత్నం చేస్తోందని దీనిపై విచారణ జరిపించాలంటూ సీపీఎంతో పాటు మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ బాండ్ల ద్వారా పార్టీల ఖజానాకు డబ్బులు చేరుతుందని చెప్పారు. దీనిపై సమాధానం ఇచ్చిన కేంద్రం... ఎలక్టోరాల్ బాండ్లను ప్రవేశపెట్టడం ద్వారా బ్లాక్మనీని అరికట్టొచ్చని అదే సమయంలో భారత్ డిజిటల్ ఎకానమీ వైపు అడుగులు వేస్తున్నందున ఈ తరహా పద్దతులు ఉపయోగపడుతాయని కోర్టుకు ఆర్థిక శాఖ వివరించింది.
ఎలక్టోరాల్ బాండ్స్ పై ఎలక్షన్ కమిషన్ అభిప్రాయం ఏమిటి..?
సుప్రీంకోర్టులో మార్చి 25న ఎన్నికల సంఘం అఫిడవిట్ దాఖలు చేసింది. ఎలక్టోరాల్ బాండ్ల రూపంలో ఏ పార్టీ అయినా విరాళాలు పొందితే ఎవరు ఇచ్చారనేది వారి వివరాలను పొందుపర్చాల్సి ఉంటుందని తెలిపింది. ఆ బాండ్ల ద్వారా వచ్చిన డబ్బులు, ఇచ్చిన వారి సమాచారం పొందుపర్చకపోతే అసలు ఫలానా పార్టీకి విరాళాలు అందాయా లేదా అనే విషయం తెలియదని పేర్కొంది. ప్రజాప్రాతినిథ్య చట్టాన్ని ఉల్లంఘించిందా లేదా అనే విషయం కూడా నిర్థారించలేమని ఎన్నికల సంఘం అఫిడవిట్లో తెలిపింది.
ప్రజాప్రాతినిథ్య చట్టం ఏం చెబుతోంది..?
ప్రభుత్వ సంస్థల నుంచి కానీ, విదేశీ సంస్థల నుంచి కానీ ఆయా రాజకీయపార్టీలు విరాళాలు తీసుకోరాదని ప్రజాప్రాతినిథ్య చట్టంలో ఉందని సుప్రీంకోర్టుకు తెలిపింది. అదే సమయంలో ఉన్న చట్టాల్లో మార్పులు కూడా చేయడం జరుగుతోందని సుప్రీంకోర్టు దృష్టికి ఈసీ తీసుకొచ్చింది. రాజకీయపార్టీలు విదేశీ సంస్థల నుంచి విరాళాలు తీసుకునేలా చట్టాల్లో మార్పులు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. రాజకీయ పార్టీలకు విదేశీ సంస్థల నుంచి విరాళాలు వస్తే.. భారత్లో తీసుకునే నిర్ణయాలు కానీ విధానాలపై కానీ ఆ విదేశీ సంస్థల ప్రభావం ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది ఎన్నికల సంఘం.
ఎలక్టోరాల్ బాండ్స్ పై కాంగ్రెస్ మాటేంటి..?
పార్లమెంటులో ఎలక్టోరాల్ బాండ్స్ గురించి పూర్తి వివరాలు వెల్లడించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలక్టోరాల్ బాండ్ల ద్వారా రాజకీయపార్టీలకు విరాళాలు ఇచ్చే ప్రక్రియకు ప్రధాని కార్యాలయం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని ఆర్టీఐ ఇచ్చిన సమాధానంలో ఉందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఆర్టీఐ ద్వారా వచ్చిన సమాధానంను జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రధాని కార్యాలయం నుంచే ఈ అవినీతి ప్రారంభమైందని రాజ్యసభలో గులాంనబీ ఆజాద్ మండిపడ్డారు. పారిశ్రామికవేత్తలే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు గులాంనబీ ఆజాద్. విరాళాల పేరుతో ఎలక్టోరాల్ బాండ్ల రూపంలో రహస్యంగా వేల కోట్లను మోడీ సర్కార్ దండుకుంటోందని దుయ్యబట్టారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా.