అవమానమే, మూల్యం చెల్లించుకుంటారు: కాంగ్రెస్కు మోడీ వార్నింగ్, మణిశంకర్కు కౌంటర్
గాంధీనగర్/న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పర విమర్శలు, ఆరోపణలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు.
ఇండియాటీవీ ఓపినియన్ పోల్: గుజరాత్లో బీజేపీదే హవా, కాంగ్రెస్ పోటీ ఇస్తుంది!
తాజాగా, కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్.. ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో రాహుల్ గాంధీ.. క్షమాపణలు చెప్పాలని మణిశంకర్ అయ్యర్ ను కోరడం గమనార్హం.
మోడీ వార్నింగ్
కాగా, తనను తక్కువస్థాయి వ్యక్తి(నీచ్) అంటూ విమర్శలు చేసిన మణిశంకర్ అయ్యర్కు ప్రధాని నరేంద్ర మోడీ గట్టి కౌంటర్ ఇచ్చారు. గుజరాత్ ఎన్నికల్లో ఈ మాటలకు త్వరలోనే మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. అది మొగలాయి ఆలోచన విధానం తప్ప మరొకటి కాదని విమర్శించారు.
మణిశంకర్ ఏమన్నారంటే..
గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో మోడీని మణిశంకర్ విమర్శిస్తూ.. ‘ఈయన(నరేంద్ర మోడీ) తక్కువ స్థాయి మనిషి(నీచ్). ఆయనకు సంస్కారం లేదు.. ఈ సమయంలో ఆయన ఎందుకు ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తున్నారు?' అని వ్యాఖ్యానించారు.
అవమానమే.. మొగలాయి మైండ్సెట్
ఈ మాటలకు ఎన్నికల ప్రచారంలో ఉన్న మోడీ స్పందిస్తూ.. ‘గొప్ప గొప్ప విద్యాసంస్థల్లో చదివి, దౌత్యవేత్తగా, కేబినెట్ మంత్రిగా కూడా విధులు నిర్వర్తించిన కాంగ్రెస్ పార్టీ నేత.. మోడీ కిందిస్థాయి సంస్కారం లేని వ్యక్తి అన్నారు. ఇది అవమానించడం మాత్రమే కాదు.. ఆయన మొగలాయి మైండ్సెట్ కూడా' అని అన్నారు.
కాంగ్రెస్ విధానమే అది.. ప్రజలే సమాధానం చెప్తారు..
అంతేగాక, ‘మణిశంకర్ అయ్యర్ అన్న మాటలకు నేను ఇంతకంటే ఏమీ చెప్పలేను. అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం. వారికి వారి భాష ఉంటే మన పని మనకు ఉంది. బ్యాలెట్ బాక్స్లలో ప్రజలు వారికి సమాధానం చెబుతారు. వారు మూల్యం చెల్లించుకుంటారు' అని మోదీ స్పష్టం చేశారు. కాగా, రాహుల్ సూచనల మేరకు మోడీకి మణిశంకర్ అయ్యర్ క్షమాపణలు చెప్పడం గమనార్హం.