అత్యంత ధనిక అభ్యర్థి: కన్యాకుమారి బరిలో నిలిచిన ఈ కాంగ్రెస్ నేత ఆస్తులు ఎంతో తెలుసా..?
Recommended Video
రాజకీయం అంటేనే డబ్బులతో ముడిపడిన వ్యవహారం. ఇక రాజకీయనాయకులు సంగతి చెప్పక్కర్లేదు. ఎలాంటి ఆస్తులు లేని రాజకీయనాయకులు దేశంలో చాలా తక్కువమంది ఉన్నారు. మరో వైపు అత్యంత ధనికులైన పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రెండో విడత ఎన్నికల్లో అభ్యర్థులను పరిశీలిస్తే అత్యంత ధనిక అభ్యర్థిగా కన్యాకుమారి నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేస్తున్న వసంతకుమారన్ నిలిచారు. ఎన్నికల సంఘానికి ఆయన సమర్పించిన అఫడవిట్లో ఆయన ఆస్తులను రూ.417 కోట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు తన ఆదాయం గత ఐదేళ్లలో 45శాతం పెరిగిందని చూపారు.
2013-14లో వసంతకుమరన్ సమర్పించిన ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్లో తన ఆదాయం 19.87 కోట్లుగా చూపారు. ఇక 2017-18 ఆర్థిక సంవత్సరం నాటికి ఆయన ఆదాయం రూ.28.93 కోట్లకు పెరిగింది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మరియు హోం అప్లయన్సెస్ సంస్థ వసంత్&కో యజమాని వసంతకుమరన్. అంతేకాదు తమిళ శాటిలైట్ టీవీ చానెల్ వసంత్కు కూడా ఓనర్ ఈయనే. ఇక అఫడవిట్లో పేర్కొన్న ప్రకారం వసంత్కుమరన్ చరాస్తుల విలువ రూ. 230,20,95,302 కోట్లు కాగా ఆయన స్థిరాస్తుల విలువ మార్కెట్ రేటు ప్రకారం రూ. 182,25,00,000 కోట్లు. ఇక రెండు కలిపితే రూ. 412,45,95,302 కోట్లుగా తేలింది.
ఇక బ్యాంకుల నుంచి ఇతరత్ర ఆర్థిక వ్యవస్థల నుంచి తీసుకున్న అప్పులు రూ.154,75,11,434 కోట్లు అని అఫడవిట్లో వసంతకుమరన్ డిక్లేర్ చేశారు. అంతేకాదు ప్రభుత్వానికి తాను ఎలాంటి బాకీ పడలేదని అఫడవిట్లో స్పష్టం చేశారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే 1967 తర్వాత కన్యాకుమారి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవలేదు. రెండో విడత ఎన్నికల్లోనే కన్యాకుమారి పార్లమెంట్ స్థానానికి ఎన్నిక జరుగుతున్నాయి. మరి ఈ పారిశ్రామికవేత్త కాంగ్రెస్ టికెట్ పై గెలిచి మళ్లీ రికార్డు నెలకొల్పుతారో లేదో తెలియాలంటే మే 23వరకు వేచిచూడక తప్పదు.