సీఎంలుగా గెహ్లాట్, కమల్నాథ్ ప్రమాణం: ఓడిపోయినా నవ్వుతూ చేతులు కలిపి.. దటీజ్ శివరాజ్ (వీడియో)
Recommended Video
మధ్యప్రదేశ్/జైపూర్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మధ్యప్రదేశ్లో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో బీఎస్పీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం మూడు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
తొలుత రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్, తర్వాత మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ సీఎంగా భూపేష్ బాఘల్ ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు పలువురు నేతలు హాజరయ్యారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు ఈ కార్యక్రమాలకు హాజరు కాలేదు.
సీఎంగా అశోక్ గెహ్లాట్, డిప్యూటీగా సచిన్ పైలట్
రాజస్థాన్లోని జయపురలోని చారిత్రక అల్బర్ట్ హాలులో అశోక్ గెహ్లాట్చే గవర్నర్ కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు సచిన్ పైలట్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, లోకసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, కర్ణాటక సీఎం కుమారస్వామి, హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా, మాజీ ప్రధాని దేవేగౌడ, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే, కర్ణాటక మాజీసీఎం సిద్ధరామయ్య, జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తదితరులు హాజరయ్యారు.
కమల్ నాథ్ ప్రమాణ స్వీకారం
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్ నాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీఎంకే చీఫ్ స్టాలిన్ తదితరులు హాజరయ్యారు.
ఆకట్టుకున్న బీజేపీ నేత, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
మధ్యప్రదేశ్లో 2003 నుంచి 2018 వరకు బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. మూడుసార్లు వరుసగా అధికారంలో ఉండటం సాధారణ విషయం కాదు. కానీ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ దానిని సాధించింది. ఛత్తీస్గఢ్లోను రమణ్ సింగ్ ప్రభుత్వం మూడుసార్లు అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది. కమల్ నాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన శివరాజ్ సింగ్ చౌహాన్ ఆకట్టుకున్నారు. ఓడిపోయిన వారు మౌనంగా కూర్చోవడం లాంటివి చూస్తుంటాం. కానీ చౌహాన్ ఓ వైపు జ్యోతిరాధిత్య సింధియా, మరోవైపు, కమల్ నాథ్ల చేతులు పట్టుకొని, మధ్యలో ఆయన నిలబడి.. నవ్వుతూ సరదాగా చేతులు ఊపారు. మూడుసార్లు సీఎంగా ఉండి, ఇప్పుడు ఓడిపోవడాన్ని కూడా ఆయన ఎంత స్పోర్టివ్గా తీసుకున్నారోనని, అది ఆయన గుణాన్ని మరోసారి చాటిందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
హృదయాలు గెలిచిన మామాజీ
శివరాజ్ సింగ్ చౌహాన్ వీడియోపై నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు. ఓడిపోయి, విపక్షంలో కూర్చున్నప్పటికీ అంతగా నవ్వుతున్న మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకోవాలని ఓ నెటిజన్ పేర్కొన్నారు. ఇది అద్భుతమని పేర్కొన్నారు. శివరాజ్ సింగ్ను మధ్యప్రదేశ్లో మామాజీ అని పిలుస్తారు. మామాజీతో ఎవరిని పోల్చలేమని, ఎంపీలో ది బెస్ట్ పర్సన్ అని, దేశంలోని ప్రతి విపక్ష పార్టీలు ఈయనను చూసి నేర్చుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడు కనుక మళ్లీ ఎన్నికలు జరిగితే మామాజీ తప్పకుండా గెలుస్తారని, తన మంచితనంతో తనను వ్యతిరేకించే ఎంతోమందిని ప్రేమించే వారిగా మార్చుకున్నారని మరొక నెటిజన్ పేర్కొన్నారు. ఎన్నికల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచిందని, కానీ మామాజీ (శివరాజ్) హృదయాలు గెలుచుకన్నాడని మరొక నెటిజన్ పేర్కొన్నారు.