ప్రచార విడుపు: ట్రాక్టర్ నడిపిన రాహుల్ గాంధీ
చండీగఢ్: చాలారోజులుగా ఎన్నికల ప్రచార సభలు, రోడ్షోలతో తీరిక లేకుండా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం సరదాగా ట్రాక్టర్ నడిపారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రస్తుతం ఆయన పంజాబ్లో పర్యటిస్తున్నారు. పలు లోక్సభ నియోజకవర్గాల్లో రోడ్ షోలల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆయన పంజాబ్లోని లూధియానాలో ఎన్నికల సభలో పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఉదయం ఫరీద్కోట్లో బహిరంగ సభలో ప్రసంగించారు. అక్కడి నుంచి లూధియానాకు చేరుకున్నారు.
రాహుల్ గాంధీ సభకు ప్రజలను తరలించడానికి అందుబాటులో ఉంచిన ట్రాక్టర్ను ఆయనను ఆకర్షించింది. ముఖ్యమంత్రి కేప్టెన్ అమరీందర్ సింగ్తో కలిసి కొద్దిసేపు ట్రాక్టర్ను నడిపించారు. ఆ సమయంలో అమరీందర్ సింగ్ ఆయన పక్కనే కూర్చున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రచారానికి వెళ్తూ రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంకా గాంధీ వాద్రాను హెలిప్యాడ్లో కలుసుకుని ఆప్యాయంగా పలకరించిన వీడియో కొద్దిరోజుల కిందటే- సోషల్ మీడియాలో సందడి చేసింది. తాజాగా- రాహుల్ గాంధీ ట్రాక్టర్ నడిపిస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్లా మారింది.
పంజాబ్ సహా బిహార్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, చండీగఢ్, ఉత్తర్ ప్రదేశ్ లల్లో మొత్తం 59 లోక్ సభ నియోజకవర్గాలకు ఈ నెల 19వ తేదీన చివరి విడత పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. దీనికోసం రాహుల్ గాంధీ ఆయా రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటలను నిర్వహిస్తున్నారు. బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ప్రియాంకా గాంధీ వాద్రా కూడా పంజాబ్ లోని పఠాన్ కోట్ లో పర్యటించారు.