పార్లమెంట్ లో మహా ప్రకంపనలు: బయట సోనియా..సభలో రాహుల్ నిరసన: మార్షల్స్ ద్వారా పంపేందుకు..!
మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామల మీద కాంగ్రెస్ ఆందోళన బాట పట్టింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా..సోమవారం సభ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ ఎంపీలతో కలిసి గాంధీ విగ్రహం వద్ద నిరసనలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయవద్దంటూ కాంగ్రెస్ సభ్యులతో కలిసి నినాదాలు చేసారు. అదే సమయంలో ఉభయ సభలు సమావేశం అయిన వెంటనే కాంగ్రెస్ సభ్యులు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేసారు.
లోక్ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ నిరసన వ్యక్తం చేసారు. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ మండిపడ్డారు. అటు రాజ్య సభలోనూ ఇదే రకంగా కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ..ఆందోళనకు దిగారు. సభలో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ సభ్యులను బయటకు పంపేందుకు మార్షల్స్ ద్వారా ప్రయత్నం జరిగింది. ఆ సమయంలో మార్షల్స్ దురుసుగా ప్రవర్తించారనే ఫిర్యాదులు వచ్చాయిజ దీంతో..ఉభయ సభల్లో బిజినెస్ ప్రారంభం కాకుండానే వాయిదా పడ్డాయి.
బయట సోనియా..సభలో రాహుల్
మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు పార్లమెంట్ ను తాకాయి. శనివారం ఉదయం అనూహ్య పరిణామాల మధ్య ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ సైతం ప్రమాణం చేసారు. దీంతో..దీని పైన అప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి సిద్దమైన శివసేన..ఎన్సీపీ..కాంగ్రెస్ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేసాయి.
మహారాష్ట్రలో జరిగిన పరిణామాలు రాజ్యాంగ విరుద్దమంటూ సుప్రీం కోర్టును మూడు పార్టీలు ఆశ్రయించాయి. ఇదే సమయంలో మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో ఆందోళనకు దిగింది. పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద సోనియా.. లోక్ సభలో రాహుల్ మహారాష్ట్ర పరిణామాలకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్నారు.
ఉభయ సభలు వాయిదా..
కాంగ్రెస్ సభ్యుల నిరసనలు..నినాదాలతో పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం ఏర్పడింది. స్పీకర్ బిర్లా సభ్యులను వారించే ప్రయత్నం చేసారు. అయినా..కాంగ్రెస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. దీంతో.. సభలో కార్యక్రమాల నిర్వహణకు ఇబ్బందిగా మారటంతో సభను స్పీకర్ వాయిదా వేసారు. అదే విధంగా రాజ్యసభలోనూ కాంగ్రెస్ సభ్యులు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.
పార్లమెంట్ ఉభయ సభలను మధ్నాహ్నం 12 గంటల వరకు వాయిదా వేసారు. అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలోనే కాంగ్రెస్ సభ్యులు నిరసన కొనసాగిస్తున్నారు. దీనికి యూపీఏ భాగస్వామ్య పార్టీలు మద్దతుగా నిలిచాయి. ఇదే సమయంలో సుప్రీంలో జరుగుతున్న వాదనల పైనా వారు ఆరా తీస్తున్నారు.
మార్షల్స్ ద్వారా బయటకు పంపేందుకు
లోక్ సభలో మహారాష్ట్ర పరిణామాల మీద కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేస్తున్న సమయంలో వారిని వారించేందుకు స్పీకర్ పలుమార్లు ప్రయత్నించారు. అయినా వారు అంగీకరించక పోవటంతో మార్షల్స్ ద్వారా ఆందోళన చేస్తున్న వారిని బయటకు పంపేందుకు ప్రయత్నం జరిగింది.
ఆ సమయంలో మార్షల్స్ కాంగ్రెస్ సభ్యులతో దురుసుగా ప్రవర్తించారని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఆరోపించారు. అయితే, ఉభయ సభల్లోనూ ఆందోళనల కారణంగా సభా కార్యక్రమాలను వాయిదా వేసారు. మార్షల్స్ ప్రయోగం పైన కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.