రూ.2 వేల కోట్ల స్కాం: వైద్య పరికరాల పేరుతో కుంభకోణం, కర్ణాటక సర్కార్పై కాంగ్రెస్ ఆరోపణలు..
కరోనా వైరస్ పేరుతో కర్ణాటక ప్రభుత్వం రూ.2 వేల కుంభకోణానికి పాల్పడిందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్క్ల పేరుతో స్కాం చేశారని విమర్శించింది. అయితే కాంగ్రెస్ ఆరోపణలను అధికార బీజేపీ తోసిపుచ్చింది. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.500 కోట్లతో మాత్రమే కరోనా వైరస్ కిట్ల కోసం ఖర్చు చేశామని కౌంటర్ ఇచ్చింది.
2 వేల కోట్ల కుంభకోణం
వైద్య పరికరాలను రాష్ట్ర ప్రభుత్వం అధిక ధరకు కొనుగోలు చేసిందని ప్రతిపక్ష నేత సిద్దరామయ్య ఆరోపించారు. దీంతో ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల నష్టం వాటిల్లిందని వివరించారు. ఇప్పటికే రూ.4100 కోట్లను వైద్య పరికరాల కోసం వెచ్చించారని.. ఇందులో సగం అంటే రూ.2 వేల కోట్లు మంత్రుల జేబుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. తమిళనాడు ఇతర రాష్ట్రాలు వెంటిలెటర్ల కోసం తక్కువ మొత్తం వెచ్చించారని తెలిపారు.
దోపిడీ
వెంటిలెటర్లు, పీపీఈ కిట్లు, ఆక్సిజన్ సిలిండర్లు పేరుతో దోపిడీ జరిగిందన్నారు. వాస్తవానికి వారు రూ.324 కోట్లు ఖర్చు చేస్తే రూ.4 వేల కోట్ల వ్యయం అయ్యిందని తెలిపారని పేర్కొన్నారు. తమిళనాడులో వెంటిలేటర్ల కోసం రూ.4.78 లక్షలు వ్యయం చేస్తే.. కర్ణాటక ప్రభుత్వం మాత్రం కనీసం రూ.5.6 లక్ష నుంచి గరిష్టంగా 18.2 లక్షలు ఖర్చుచేసిందన్నారు. ఈ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జీ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలోనూ బీజేపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ విమర్శించారు.
Recommended Video
అదేం లేదు..
కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. వెంటిలేటర్లు రకరకాల ధరల్లో లభిస్తాయని డిప్యూట సీఎం అశ్వత్ నారాయణ తెలిపారు. రూ.4 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు లభిస్తాయని గుర్తుచేశారు. తాము నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తామని.. కాంగ్రెస్ మాదిరిగా చవకైనవి కొనుగోలు చేయబోమని తెలిపారు. పరికరాల సేకరణకు రూ.500 కోట్లు... రైతులు, డ్రైవర్లు, వలసకూలీల కోసం కలిపి రూ.2 వేల117 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపాలని.. తాము సిధ్దమని స్పష్టంచేశారు.