కర్నాటక లో కాంగ్రెస్ పతనం ఖాయం..! ఫలితాల తర్వాత అనూహ్య మార్పులన్న మాజీ సీఎం..!!
బెంగళూరు/హైదరాబాద్ : కర్ణాటక రాజకీయాలు విచిత్ర మలుపులు తిరుగుతున్నాయి. కుమార స్వామి ప్రభుత్వం పై రోజుకో ఆరోపణలు ఘుప్పు మంటున్నాయి. ప్రతిపక్ష పార్టీ నేతలే కాకుండా సొంత పార్టీ నేతలు సైతం కుమార స్వామి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దా రామయ్య మాత్రం, కుమార స్వామి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గా తన సత్తాను నిరూపించుకున్నారని చెప్తూనే సందర్బం వచ్చినప్పుడల్లా సీఎం కుర్చీ గురించి ప్రస్తావిస్తుంటారు. ఇక ప్రతిపక్ష బీజేపి నేతలైతే కుమార స్వామి ప్రభుత్వాన్ని తుమ్మితే ఊడిపోయే ముక్కుతో పోల్చుతుంటారు. తాజాగా బీజేపి మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.
23 తర్వాత రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం..!!
ఈనెల 23 తర్వాత రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం తానంతట అదే కుప్పకూలనుందని, అనంతరం బీజేపీ అధికార పగ్గాలు చేపట్టనుందని మాజీ సీఎం జగదీశ్శెట్టర్ జోస్యం చెప్పారు. హుబ్బళ్ళిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిద్దరామయ్య మళ్ళీ సీఎం అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరపైకి తెచ్చిన కొత్త నినాదంతో సంకీర్ణ ప్రభుత్వంలో భారీ ముసలం ఏర్పడిందన్నారు. అంతే కాకుండా ముఖ్యమంత్రులను మార్చడం కాంగ్రెస్ సంస్క్రుతిలో భాగమని తెలిపారు.
సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యానాలు..!
లోక్సభ ఎన్నికలు ముగిసేంతవరకు వేచిచూడండి అంటూ.. ఇంతవరకు సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యానాలకు ఇప్పుడు అర్థం తేటతెల్లం అవుతోందన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ నేతల్లో మంత్రుల స్థాయిలోనూ, ఎమ్మెల్యేల స్థాయిలోనూ కుమ్ములాటలు ప్రారంభమయ్యాయన్నారు. కాగా చించోళి, కుందగోళ నియోజకవర్గాలలో గెలుపు కోసం కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతోందని శెట్టర్ సంచలన ఆరోపణలు చేసారు.
కాంగ్రెస్ కు బీజేపి వార్నింగ్..!
మంత్రి డి.కె.శివ కుమార్ స్వయంగా తమ కార్యకర్తలను వలలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కనకపుర తరహా గూండాగిరి ఇక్కడ సాగదని ఆయన హెచ్చరించారు. బీజేపీ అంతర్గత వ్యవహరాలలో జోక్యం చేసుకోవడం తక్షణం నిలిపివేయాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.
కుమార స్వామి విఫలం..!
రాష్ట్రంలో కరువు పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నా ముఖ్యమంత్రికి ఇవేమీ పట్టడం లేదన్నారు. ప్రజాసమస్యలను గాలికి వదిలి దేవాలయాల్లో ప్రదక్షిణలు చేస్తుండడం దారుణమన్నారు. వైమానికదాడుల సందర్భంగా పాకిస్థాన్లో ఉగ్రవాదులెవరూ చనిపోలేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న వాదనను ఇటలీ జర్నలిస్టు ఒకరు జరిపిన పరిశోధన తోసిపుచ్చేలా చేసిందన్నారు.