మోడీ ప్రసంగం రీటెలికాస్ట్, ఈసికి కాంగ్రెస్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: గత నెలలో భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో భాగంగా మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో చేసిన ప్రసంగాన్ని మహారాష్ట్రలోని పలు స్ధానిక ఛానళ్లలో ప్రసారం చేయడంపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
మాడిసన్ స్క్వేర్లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన ప్రసంగాన్ని భారతీయ జనతా పార్టీ ప్రకటనగా రూపొందించి... ఆ ప్రకటనను హోర్డింగులు, వీడియో రూపంలో మరాఠీ ఛానల్స్లో రీటెలికాస్ట్ చేయించింది. అక్టోబర్ 15 బుధవారం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోడీ ప్రసంగాన్ని ఛానళ్లలో ప్రసారం చేయడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలిపింది. ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది.
ఈ విషయంపై బీజేపీ వినయ్ సహస్ర బుద్దే మాట్లాడుతూ "మోడీ మాడిసన్ స్క్వేర్ ప్రసంగం ప్రైవేట్ ది. బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన కార్యక్రమం అది. అంతేగానీ, అదేమీ ప్రభుత్వ కార్యక్రమం కాదు" అని అన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకుడైన మోడీ ప్రసంగాన్ని రీటెలికాస్ట్ చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు కాదని పేర్కొన్నారు.
ఇంతకీ మాడిసన్ స్క్వేర్లో భారత్ ప్రధాని ఏమి మాట్లాడారు. ఆరోజు మాడిసన్ స్క్వేర్లో ప్రధాని మోడీ భారత దేశం ప్రపంచ శక్తిగా మారడానికి కోట్లాది మంది కృషి ఉందని, గతంలో భారత్ ను అందరూ వెనుకబడిన దేశంగా భావించేవారని, ఇప్పుడు మీ అందరి కష్టంతో ఐటి హబ్ గా గుర్తించారని మోడీ ప్రశంశించారు.
ఎన్నికలలో గెలవడం అన్నది పదవి కాదని గొప్ప బాధ్యత అని, మీరు ఓటు వెయ్యకపోయినా ఫలితాల కోసం ఆత్రుతగా చూసి ఉంటారని తెలిపారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఆ మార్పును ఎన్డియే ప్రభుత్వం తీసుకు వస్తుందని మోడీ స్పష్టం చేశారు. 21వ శతాబ్దమంతా ఆసియా దేశాలదేనని, అందులో భారత్ కీలక భూమిక పోషిస్తుందని, భారత్ బలమంతా యువశక్తేనని ప్రధాని తెలిపారు.
అలాగే చిరకాలంగా అమెరికా ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ అతిపెద్ద ప్రజారాజ్య దేశం మనదేనని మోడీ అభిప్రాయపడ్డారు. ఇక అమెరికా అభివృద్ధిలో భారతీయుల పాత్ర కీలకమని, అమెరికా, భారత్ రెండు కలిపి పని చేస్తే అద్భుతమైన ప్రగతిని సాధిస్తామని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ ప్రసంగానికి సుమారు 20వేలకి పైగా ఎన్నారైలు హాజరయ్యారు.
కొంకణ్ ప్రాంతం సహజవనరులు: ప్రధాని మోడీ
మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతాన్ని అభివృద్ది చేయడంలో కాంగ్రెస్, ఎన్సీపీ నిర్లక్ష్యం చేసిందని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. సోమవారం రత్నగిరి వద్ద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ రాష్ట్రానికి కొంకణ్ ప్రాంతం అభివృద్దికి గేట్ వే లాంటిదని అన్నారు. కొంకణ్ ప్రాంతం సహజవనరులకు కేంద్రమని, ఇక్కడ అభివృద్దికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని అన్నారు. బుధవారం మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.