‘నేషనల్ హెరాల్డ్కు ఇచ్చిన రుణం రద్దు చేయాల్సింది’
ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురణకర్తలు బాకీపడిన రూ.90.25 కోట్ల రుణాన్ని కాంగ్రెస్ రద్దు చేసి ఉండాల్సిందే కానీ, ధార్మిక సంస్థకు దాన్ని అప్పగించకపోవాల్సిందని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం అభిప్రాయపడింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో భారతీయ జనతా పార్టీ నేత సుబ్రమణ్యం స్వామి దాఖలు చేసిన మోసం, నమ్మకద్రోహం కేసులో ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్ల నుంచి మినహాయింపు కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ, మరో నలుగురు చేసుకున్న అభ్యర్థనలపై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది.
దీనిపై తీర్పును రిజర్వులో ఉంచిన కోర్టు ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురణకర్త 'అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్'(ఏజేఎల్)కు కాంగ్రెస్ పార్టీ రూ.90.25 కోట్లు రుణంగా ఇచ్చింది.
2010 డిసెంబరు 28న దాన్ని కాంగ్రెస్ నేతలు డైరెక్టర్లుగా ఉన్న 'యంగ్ ఇండియన్ లిమిటెడ్'(వైఐఎల్)కు ధారాదత్తం చేసింది. కాగా, అలా చేయడం మోసం, నమ్మకద్రోహం అంటూ సుబ్రమణ్యం స్వామి కేసు దాఖలు చేశారు.
.