ఆజాద్, ఆనంద్శర్మపై కాంగ్రెస్ గరంగరం- నేతల కౌంటర్లు- శ్రేణుల నిరసనలు
ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు మరోసారి ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే సోనియాగాంధీ నాయకత్వంపై విమర్శలు చేస్తూ గతంలో ఆమెకు లేఖలు రాసిన 23 మందిలో ఇద్దరు నేతలు మరోసారి సమరశంఖం పూరించారు. ఇందులో ఒకరైన గులాం నబీ ఆజాద్ బహిరంగంగానే ప్రధాని మోడీని పొగడ్తలతో ముంచెత్తగా, మరొకరు ఆనంద్శర్మ బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలపై విమర్శలు చేశారు. దీంతో వీరిపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ప్రధాని మోడీని పొగుడుతూ కశ్మీర్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై జమ్మూలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆజాద్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపాయి. ఆజాద్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. తాజాగా జమ్మూలో ఆజాద్ నిర్వహించిన జీ 23 సమావేశం బీజేపీకి మేలు చేసేదిగా ఉందని స్ధానిక నేతలు విమర్శలు చేశారు. కాంగ్రెస్లో ఎన్నో పదవులు అనుభవించిన ఆజాద్.. పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి ఇలాంటి వ్యతిరేక చర్యలకు పాల్పడటం సరికాదని జమ్మూ నేతలు విమర్శించారు.
మరోవైపు బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్తో ఎన్నికల పొత్తు కుదుర్చుకోవడాన్ని తప్పుబట్టిన సీనియర్ నేత ఆనంద్ శర్మపైనా పార్టీలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆనంద్శర్మ వ్యాఖ్యలపై స్పందించిన లోక్సభ కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధురి.. పార్టీలో తమ స్ధానాల గురించి ఆలోచించడం మాని విశాల హృదయంతో ఆలోచించాలని చురకలు అంటించారు. ప్రధానిని పొగిడేందుకు సమయం వృధా చేసుకోవడం మాని పెద్ద విషయాలపై ఆలోచించాలని కూడా చౌధురి కోరారు. సీనియర్లు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించాల్సింది పోయి నీడనిచ్చే చెట్టును కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని అధిర్ రంజన్ తీవ్ర విమర్శలు చేశారు.