అహ్మద్ మృతిని దాచిపెట్టి.. ఆలస్యంగా ప్రకటించారు: కేంద్రంపై కాంగ్రెస్
బడ్జెట్ సమావేశం నేపథ్యంలో.. ఆయన మృతిని ఉద్దేశ్యపూర్వకంగానే ఆలస్యంగా ప్రకటించారని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ ఆరోపించారు.
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి, కేరళ ఎంపీ ఇ.అహ్మద్ మృతిపై చర్చ జరిపి తీరాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. అహ్మద్ మృతిపై కేంద్రం ఆలస్యంగా ప్రకటన చేసిందని, ఆయన చనిపోయిన కొద్ది గంటల తర్వాత ఆసుపత్రి వర్గాల చేత ప్రకటన చేయించారని ఆరోపిస్తున్నారు.
ఆసుపత్రికి చేర్చే సమయానికే అహ్మద్ మృతి చెందినట్టుగా తెలుస్తోందని.. కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి ఆలస్యం ప్రకటన చేయించారని కాంగ్రెస్ మండిపడుతోంది. బడ్జెట్ సమావేశం నేపథ్యంలో.. ఆయన మృతిని ఉద్దేశ్యపూర్వకంగానే ఆలస్యంగా ప్రకటించారని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ ఆరోపించారు.
ఇది చాలా అవమానకర చర్య అని.. ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో అహ్మద్ మృతదేహం ఉంచిన విషయంపై చర్చ జరగాల్సిందేనని ఆజాద్ డిమాండ్ చేశారు. కాగా, బడ్జెట్ సమావేశానికి ఒకరోజు ముందు గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన అహ్మద్..మరుసటి రోజు మృతి చెందిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, సిట్టింగ్ ఎంపీ మరణిస్తే సభ వాయిదా వేసే సంప్రదాయం ఉన్నందునా బడ్జెట్ వాయిదా వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కానీ అహ్మద్కు నివాళులర్పించిన అనంతరం బడ్జెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.
కావాలనే 'ప్రకటన'లో జాప్యం: సీతారాం ఏచూరి
అహ్మద్ మృతి విషయాన్ని ఆలస్యంగా ప్రకటించడంలో కేంద్రం కావాలనే జాప్యం చేసిందని సీపీఎం సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి ఆరోపించారు. దీనిపై దర్యాప్తు జరిపి అనుమానాలను నివృత్తి చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. రాజ్యసభలో జీరో అవర్ సందర్బంగా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు.
తనకు పలువురు వైద్యుల నుంచి సమాచారం ఉందని, ఆసుపత్రికే తరలించే సమయానికే అహ్మద్ చనిపోయారని ఏచూరి పేర్కొన్నారు.