యడ్డీ డైరీ : ఆ సంస్థతో విచారణకు కాంగ్రెస్ డిమాండ్ ? ఎందుకంటే, కారణమిదేనా ?
హైదరాబాద్ : 'యడ్డీ డైరీస్' దేశవ్యాప్తంగా ప్రకంపనాలు రేపుతోంది. అప్పటి కర్ణాటక సీఎం బీజేపీ పెద్దలకు రూ.1800 కోట్లు ఇచ్చారని కారావాన్ మ్యాగజైన్ రిపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారింది. ఇది బీజేపీ అవినీతికి ప్రత్యక్ష్య సాక్ష్యమని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ టీం 'చోర్ చౌకీదార్' అని మరోసారి రుజువైందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బీజేపీకే సారే చౌకీదార్ చోర్ హై : యడ్డీ డైరీపై రాహుల్
లోక్పాల్ విచారణ
ఒక అడుగు ముందుకేసిన కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేసింది. ఇటీవల ఏర్పాటుచేసిన లోక్పాల్ పీసీ ఘోష్ చేత విచారణ జరిపించాలని పట్టుబడుతోంది. బీజేపీ సెంట్రల్ కమిటీ, ఆ పార్టీ నేతలు అద్వానీ, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితరులకు రూ.1800 కోట్లు ఇచ్చారని డైరీలో యడ్డూరప్ప రాసుకున్నట్టు మ్యాగజైన్ నివేదించిన సంగతి తెలిసిందే.
మోదీ నుంచి మొదలుకొని ...
ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా. యడ్డీ డైరీ కేసులో ప్రధాని మోదీ నుంచి కిందిస్థాయి నేతలందరినీ విచారించాలని, అప్పుడే నిజనిజాలు బయటపడుతాయన్నారు. అరుదైన ఈ కేసు బాధ్యతను ఇటీవల నియమించిన లోక్పాల్తో విచారణ జరిపించాలని కోరారు.
జైట్లీ ఎందుకు స్పందించలేదు ?
అప్పట్లో కలకలం రేపిన యడ్డీ డైరీపై విచారణ జరిపించాలా ? అని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని ఐటీశాఖ ఉన్నతాధికారులు అడిగారాని .. కానీ విచారణ జరిపితే ఎక్కడ తన బండారం బయటపడుతుందని భయపడ్డ జైట్లీ ఎంక్వైరీకి ఒప్పుకోలేదని మండిపడ్డారు. కర్ణాటకలో జరిగిన అవినీతి ఉదంతం గురించి ప్రతిపక్షంగా ప్రజలకు చెప్పడమే మా బాధ్యత అని స్పష్టంచేశారు.
2017 నుంచి ఏం చేస్తున్నారు ?
డైరీలో యడ్యూరప్ప సంతకం ఉంది. అది ఆదాయపు పన్ను శాఖ వద్ద ఉన్నా .. ఎందుకు చర్యలు తీసుకోలేదు. 2017 నుంచి ఐటీ వద్ద ఉన్న కేంద్రంలోని ప్రభుత్వం నిద్రపోతుందా అని ప్రశ్నించారు. అవినీతి భాగోతంపై విచారించాలనే ఆలోచన ఎందుకు రాలేదని కొశ్చన్ చేశారు.