తప్పే, సారీ: సోనియాని ఏకేసిన సొంత పత్రిక, ఏం రాసింది?
ముంబై: ముంబై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజయ్ నిరుపమ్ సోమవారం నాడు పార్టీకి క్షమాపణలు చెప్పారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ పైన విమర్శలు గుప్పిస్తూ... కాంగ్రెస్ పార్టీ పత్రిక 'కాంగ్రెస్ దర్శన్'లో వచ్చింది.
దీనికి ఆయన క్షమాపణలు చెప్పారు. కాంగ్రెస్ దర్శన్లో వచ్చిన కొన్ని వ్యాఖ్యలు అభ్యంతరకరమేనని చెప్పారు. నేను నా తప్పును అంగీకరిస్తున్నానని చెప్పారు.
సీనియర్ జర్నలిస్ట్, కాంగ్రెస్ దర్శన్ ఎడిటర్ ఇన్ చీఫ్ నిరుపమ్ కూడా మాట్లాడుతూ... నెహ్రూ, సోనియాలకు వ్యతిరేకంగా వచ్చిందని, దానికి బాధ్యులైన వారి పైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
డిసెంబర్ 28, 1885లో ఇండియన్ జాతీయ కాంగ్రెస్ స్థాపించారు. సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ 130వ ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటోంది. ఇలాంటి సమయంలో నెహ్రూ, సోనియాలకు వ్యతిరేకంగా వారి పార్టీ పత్రికలోనే రావడం చర్చకు దారి తీసింది.
ఆ పత్రికలో ఏం వచ్చింది?
మహారాష్ట్ర నుంచి వెలువడుతున్న 'కాంగ్రెస్ దర్శన్' పత్రికలో ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా వరుసగా కథనాలు వచ్చాయి. దీనిపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ పార్టీ మరాఠా శాఖ విపక్షాలకు సమాధానాలు చెప్పలేని విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది.
సోనియా తండ్రిని ఇటలీలో ఫాసిస్ట్ ముఠా సభ్యుడిగా అభివర్ణించిన ఆ పత్రిక, పార్టీ సభ్యత్వం తీసుకున్న 62 రోజుల్లోనే సోనియా పార్టీ పగ్గాలు చేజిక్కించుకున్నారని పేర్కొంది. అంతేకాక కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సోనియా విఫలమయ్యారని విమర్శించింది.
నెహ్రూ గురించి పేర్కొంటూ... నాటి ఉప ప్రధానిగానే కాక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ సూచనలను నెహ్రూ పెడచెవిన పెట్టారని ఆరోపించింది. నాడు పటేల్ సూచనలను పాటించి ఉంటే ప్రస్తుతం కాశ్మీర్లో నిత్యం అగ్గి రాజుకుని ఉండేది కాదని పేర్కొంది.