22న సీడబ్ల్యూసీ భేటీ.. కొత్త అధ్యక్షుడి ఎంపిక, ఇతర అంశాలపై చర్చ..
రథసారథి లేకుండానే కాంగ్రెస్ కాలం వెళ్లదీస్తోంది. అనారోగ్య సమస్యలతో సోనియా గాంధీ ఇబ్బంది పడుతున్నారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అయితే పార్టీకి నూతన జవసత్వాలు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాయకత్వ మార్పుపై నేతలు పట్టుబట్టడంతో ఆ పనిపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. ఈ నెల 22వ తేదీన కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి సీడబ్ల్యూసీ సమావేశం కానున్నది.
ఆ రోజు కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక తేదీని కూడా నిర్ణయించే అవకాశం ఉంది. గత కొద్దీరోజులుగా అధినేత లేకపోవడంతో లోటు కనిపిస్తోంది. దీనిని ఆసరాగా తీసుకొని కొందరు విమర్శలు కూడా చేశారు. దీంతో అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. తాజా రాజకీయ పరిణామాలతోపాటు పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ను కూడా ఈ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో వర్చువల్ విధానంలో భేటీ జరగనుంది.
పార్లమెంటు సమావేశాలు జరగడానికి వారం రోజుల ముందు సమావేశం జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతోపాటు పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలపై రైతులు చేపట్టిన ఆందోళన గురించి సమావేశంలో చర్చిస్తారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతారు.