చేతులు కాలాక : కాంగ్రెస్ సమీక్ష.. సీనియర్లపై రాహుల్ గుస్సా.. కొద్దిరోజులు అందరికీ దూరం
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవీకి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ ప్రతిపాదనను సీడబ్ల్యూసీ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అయితే తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని రాహుల్ సంకేతాలు ఇచ్చారు. ఆదివారం కాంగ్రెస్ నేతలకు అందుబాటులో లేకుండా పోయారు. ఫోన్ కూడా స్విచ్చాప్ చేసి .. తన రాజీనామా నిర్ణయమే సరైనదనే బలంగా వాదిస్తున్నట్టు తెలుస్తోంది.
దిగివస్తున్న పాక్ ..కొత్త ప్రభుత్వంతో చర్చలకు సిద్దం అంటున్న పాక్ నేతలు
కారణమిదీ
సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి కాంగ్రెస్ లోని సీనియర్లే కారణమని రాహుల్ మొన్నటి సీడబ్ల్యూసీ సమావేశంలో విమర్శించారు. మాజీ కేంద్రమంత్రి చిదంబరం, రాజస్థాన్ సీఎం గెహ్లట్, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ .. పార్టీ కోసం పనిచేయలేదని, వారి కుమారుల జీవితం లక్ష్యంగా పనిచేశారని విమర్శించారు. చిదంబరం తన కుమారుడు కార్తీ టికెట్ ఇవ్వకుంటే రాజీనామా చేస్తానని బెదిరించాడని రాహుల్ మండిపడ్డారు. ఇక అశోక్ గెహ్లాట్ తన కుమారుడు వైభవ్ ను గెలిపించుకునేందుకు జోధ్ పూర్ లోనే వారం రోజులు మకాం వేశారని .. కుమారుడి కోసం సమయం కేటాయించి, పార్టీని వదిలేయడం సబబా అని ప్రశ్నించారు. ఛింద్వారాలో కమల్ నాథ్ కుమారుడు నకుల్ కు టికెట్ ఇవ్వకుంటే తాను సీఎంగా ఉండి ప్రయోజనం ఏంటని ప్రశ్నించాడని .. ఎంతో ఒత్తిడి తీసుకొచ్చి టికెట్లు ఇప్పించుకున్నారని గుర్తుచేశారు.
మీకు బాధ్యత లేదా ?
కాంగ్రెస్ సీనియర్లపై రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ విజయం కోసం గాంధీ-నెహ్రూ కుటుంబాలే పోరాడాలా ? మీకు ఆ బాధ్యత లేదా అంటూ సీనియర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ముఖ్య నేతలకు పిల్లలు, బంధువులే ముఖ్యం .. అందుకే పార్టీని పట్టించుకోవడం లేదని వాపోయారు రాహుల్. సీడబ్యూసీ సమావేశంలో పలుమార్లు ప్రియాంక కల్పించుకొని ... పార్టీ ఓటమికి కారణమైనన వారు సమావేశంలోనే ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రధాన అస్త్రాలు చౌకీదార్ చోర్ హై, రాఫెల్ డీల్ గురించి నేతలంతా ఎందుకు ప్రశ్నించలేదని ప్రియాంక నిలదీశారు. అంతేకాదు ప్రధాని మోదీ అవినీతిని కూడా ఏ నేత కూడా ప్రస్తావించలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
అందుబాటులో లేని రాహుల్
తన రాజీనామాను సీడబ్ల్యూసీ ఆమోదించకపోవడంతో రాహుల్ గాంధీ అలకబూనారు. అందుకే ఆదివారం ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. దీంతో కాంగ్రెస్ నేతలు తాము రాహుల్ వెంటే ఉన్నామని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 'istand with rahul gandhi‘ అనే హ్యాస్ ట్యాగ్ పెట్టి మరీ మద్దతు తెలుపుతున్నారు. మీరు మరోసారి ఎన్నికల యుద్ధంలో పాల్గొనాలని .. తప్పకుండా విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అప్పటివరకు మేం మీతోనే ఉంటామని ఆల్ ఇండియా మహిళ కాంగ్రెస్ ట్వీట్ లో పేర్కొంది.
మరోసారి ఆలోచించు సోదరా
ఇటు రాహుల్ నిర్ణయాన్ని ఆమె సోదరి ప్రియాంక గాంధీ తప్పుపట్టారు. ఒకవేళ రాహుల్ అధ్యక్ష పదవీ నుంచి తప్పితే అతను బీజేపీ ట్రాప్ లో పడినట్టేనన్నారు ప్రియాంక గాంధీ. అప్పుడు బీజేపీ కాదు .. కాంగ్రెస్ పార్టీలో కూడా రాహుల్ అధ్యక్ష పదవీ నుంచి తప్పించాలని ప్రతిపాదనలు వస్తాయని తెలిపారు.