అనిల్ అంబానీకి దోచిపెట్టేందుకే: మోడీపై రాహుల్, మోడీకి ములాయం మద్దతివ్వడంపై..
న్యూఢిల్లీ: కాగ్ రిపోర్ట్ పైన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ బుధవారం అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగ్ రిపోర్టులో లెక్కలు తారుమారు అయ్యాయని ఆరోపించారు. అసలు ఒప్పందానికి, ప్రధాని నరేంద్ర మోడీ కుదుర్చుకున్న ఒప్పందానికి చాలా తేడా ఉందని చెప్పారు. రక్షణ కార్యదర్శి నోట్ను కాగ్ రిపోర్టులో ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు.
రాఫెల్ ఒప్పందంలో ఎలాంటి అక్రమాలు జరగకుంటే జేపీసీ విచారణకు (జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు) బీజేపీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. రాఫెల్ కొనుగోళ్లలో అవకతవకలు జరగకపోతే జేపీసీ ఎందుకు వెనుకాడుతున్నారని నిలదీశారు.
అనిల్ అంబానికి దోచిపెట్టేందుకే రాఫెల్ ఒప్పందం అని రాహుల్ గాంధీ ఆరోపించారు. అసలు ఒప్పందానికి, మోడీ కుదుర్చుకున్న దానికి చాలా తేడా ఉందని చెప్పారు. కొత్త ఒప్పందం వల్ల తక్కువ ధరకే విమానాలు వస్తున్నాయని ప్రధాని మోడీ, రక్షణ, ఆర్థిక మంత్రి చెబుతున్నారని తెలిపారు. కానీ అవి తప్పని తేలిందన్నారు.
అంతకుముందు, ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. తాజాగా ది హిందూ బుధవారం ప్రచురించిన కథనాన్ని ఉద్దేశిస్తూ.. వేగవంతమైన డెలివరీ, ధర విషయంలో గత ఒప్పందం కంటే నూతన ఒప్పందమే అనేక రెట్లు మేలని వాదించిన మోడీ బండారం బట్టబయలు అయిందన్నారు.
నిబంధనల విషయంలో తాజా ఒప్పందం కంటే యూపీఏ హయాంలో జరిగిన ఒప్పందమే ఉత్తమమైనదని ది హిందూ పేర్కొంది. ఈ విషయమై చర్చల బృందం(ఇండియన్ నెగొషియేటింగ్ టీమ్)లో ఉన్న రక్షణశాఖకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులు ముందే స్పష్టమైన అవగాహనకు వచ్చినట్లు కథనంలో ప్రచురించారు.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ స్పందించారు. రెండు అంశాల్లో ఈ ఒప్పందం మేలైనదని మోడీ వాదిస్తున్నారని, వాటిల్లో మొదటిది ఉత్తమ ధర, రెండోది వేగవంతమైన డెలివరీ అని, కానీ తాజా ది హిందూ నివేదికతో ఈ రెండు విషయాల్లో ఆయన వాదనలు తప్పని తేలిపోయిందని చెప్పారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు చేసిన ఆరోపణల్ని ప్రధాని ఖండిస్తూ వచ్చారని గుర్తు చేశారు.
ఇదిలా ఉండగా, ఎస్పీ సుప్రీం ములాయ్ సింగ్ యాదవ్ ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించడంపై రాహుల్ గాంధీ స్పందించారు. నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావాలని ములాయం కోరుకున్నారు. ఈ వ్యాఖ్యలతో రాహుల్ విభేదించారు.