శబరిమల ఆలయంలోకి మహిళలు: కాంగ్రెస్ నేత నిరాహార దీక్ష!
Recommended Video
తిరువనంతపురం: హిందువుల ప్రముఖ పుణ్యక్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి అనుమతిని ఇస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పడంపై అభ్యంతరాలు కొనసాగుతున్నాయి. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ రివ్యూ పిటిషన్ వేయాలని కేరళ కాంగ్రెస్ భావిస్తోంది. అంతేకాదు, కేరళ కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాల శుక్రవారం నిరాహార దీక్ష చేయనున్నారు.
ఈ మేరకు ట్రావెన్కోర్ మాజీలు గురువారం సమావేశం కానున్నారు. ట్రావెన్ కోర్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, గురువాయూరు, కొచ్చి దేవస్థానం బోర్డు సభ్యులు కలిసి పాల్గొంటారు. ఈ సమావేశంలో రివ్యూ పిటిషన్కు సంబంధించి తుది నిర్ణయానికి వస్తారు.
కేపీసీసీ అధ్యక్షులు ముల్లప్పల్లి రామచంద్రన్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీనియర్ నేత రమేశ్ పాల్గొంటారు. సుప్రీం కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్, మహిళలు ఆలయంలోకి ప్రవేశిస్తే భవిష్యత్తులో సంభవించే పరిణామాలు, రమేశ్ నిరాహార దీక్షకు మద్దతు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చిస్తారు.
ఇదిలా ఉండగా, ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా పిటిషన్ వేసే యోచన లేదని కేరళ ప్రభుత్వం చెప్పింది. ఆలయ వ్యవహారాలు చూసుకునే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కూడా సుప్రీం కోర్టు తీర్పు పునః పరిశీలన కోరే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శబరిమలలో మహిళలకు స్నానాల కోసం ప్రత్యేక ఘాట్లు, బస్సుల్లో ప్రత్యేక సీట్ల కేటాయింపు, రాత్రి పూట భద్రత కోసం లైట్ల సంఖ్యను పెంచడం, మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్ల ఏర్పాటు వంటి సదుపాయాలను కల్పించే యోచనలో కేరళ ప్రభుత్వం ఉంది.