బాబ్రీ తీర్పు రాజ్యాంగ విరుద్ధమన్న కాంగ్రెస్- కేంద్రం, యూపీ అప్పీలు చేయాలని డిమాండ్...
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పు బీజేపీ నేతలకు ఊరటనివ్వగా.. విపక్ష కాంగ్రెస్లో మాత్రం ఆక్రోశం నింపింది. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పుపై కాంగ్రెస్ పార్టీ ఇవాళ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సీబీఐ కోర్టు తీర్పు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా తెలిపారు.
బాబ్రీ తీర్పుపై అప్పీలుకు ముస్లిం సంఘాల నిర్ణయం-త్వరలో హైకోర్టులో పిటిషన్
1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ కోర్టు తీర్పుపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఈ కోర్టు రాజ్యాంగ విరుద్ధంగా, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా తెలిపారు. రాజ్యాంగంపై నమ్మకం ఉన్న వారెవరైనా ఇవాళ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం, యూపీ సర్కారు హైకోర్టులో అప్పీలుకు వెళ్తాయని ఆశిస్తాయని సూర్జేవాలా పేర్కొన్నారు. గతేడాది నవంబర్ 9న ఇదే కేసుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బాబ్రీ మసీదు కూల్చివేత అక్రమమని వ్యాఖ్యానించిందని ఆయన గుర్తు చేశారు.
బాబ్రీ మసీదు కూల్చివేత వ్యవహారంలో తుదుపరి కార్యాచరణపై కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కేంద్రం, యూపీ సర్కారుపై అప్పీలుకు వెళ్లేలా ఒత్తిడి పెంచడంతో పాటు తాము చేపట్టాల్సిన చర్యలపైనా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో హైకోర్టులో అప్పీలుకు వెళ్లాలని నిర్ణయించిన ముస్లిం సంఘాలకు మద్దతిచ్చే విషయంపైనా కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది.