ప్రతీకార రాజకీయాలు.. నిరంకుశం వీడండి.. మోడీపై భగ్గుమన్న కాంగ్రెస్.. అమిత్ షా బయటకు..
గాంధీ కుటుంబానికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతను తొలగించడంపై లోక్సభలో గందరగోళం నెలకొన్నది. కాంగ్రెస్ పార్టీ సభ్యులు నినాదాలు చేస్తూ ప్రధాని మోడీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో సభ అరుపులతో మార్మోగింది. కాంగ్రెస్ సభ్యుల నినాదాలు మిన్నంటడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ సందర్భంలో సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇటీవల సోనియాగాంధీతోపాటు రాహుల్, ప్రియాంక గాంధీకి ఎస్పీజీ భద్రతను ఉపసంహరించుకోవడం వివాదంగా మారింది. వివరాల్లోకి వెళితే.
లోక్సభలో మిన్నంటిన నినాదాలు
సోనియా, రాహుల్, ప్రియాంకకు 100 మందితో జడ్ ప్లస్ క్యాటగిరీతో కూడిన పారామిలిటరీ సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్ఫీఎఫ్) సిబ్బంది భద్రత ఉండేది. అయితే ఇటీవల ఆ ముగ్గురికి జడ్ ప్లస్ భద్రతను ఉపసంహరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. హోంశాఖ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే క్వశ్చన్ అవర్ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా పోడియంను కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యులు చుట్టుముట్టారు.
పోడియం చుట్టుముట్టిన కాంగ్రెస్
కాంగ్రెస్, ఎన్సీ సభ్యులు పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేస్తుండటంపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. సభలో రైతుల సమస్యలపై చర్చ ఉన్నందున సహకారం అందించాలి. ముఖ్యమైన అంశంపై చర్చ జరిగేటప్పుడు సభ్యులు ఇలాంటి అడ్డుపడటం సరికాదు. మీకు రైతుల ప్రయోజనాలపై ఆసక్తిలేదనే విషయం ప్రజల్లోకి వెళ్తుంది అని స్పీకర్ వారితో అనడం కనిపించింది.
నిరంకుశత్వం వీడండి..
స్పీకర్ ఓం బిర్లా పలుమార్లు సభ్యులను ఉద్దేశించి కోరినప్పటికీ కాంగ్రెస్, ఎన్సీ సభ్యులు నినాదాలతో సభను అట్టుడికించారు. ప్రధాని సమాధానం చెప్పాల్సిందే. దయచేసి ప్రతీకారపూరిత రాజకీయాలు ఆపండి. నిరంకుశుతత్వాన్ని విడనాడండి. మా నాకు న్యాయం కావాలి అంటూ కాంగ్రెస్, ఇతర సభ్యులు నినాదాలు చేశారు. నిరసన అనంతరం కాంగ్రెస్ సభ్యుడు అధీర్ రంజన్ చౌదరీ లోక్సభలో వాయిదా తీర్మానానికి సంబంధించిన నోటీసును ఇచ్చారు. గాంధీ కుటుంబానికి భద్రతను ఉపసంహరించడంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు.
వాజ్పేయ్ భద్రత కల్పిస్తే..
కాంగ్రెస్, ఇతర పార్టీల సభ్యులను తమ తమ స్థానాలకు వెళ్లాలని స్పీకర్ సూచించడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాజ్పేయ్కి ఎస్పీజీ రక్షణ కల్పిస్తే ప్రధాని మోడీ ఆయనకు భద్రతను ఉపసంహరించారు. ఈ విషయంపై సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేయడంతో లోక్సభలో తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. అధికార, విపక్షాలు ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధించుకొన్నారు. అనంతరం కాంగ్రెస్తోపాటు పలు పార్టీల నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు.
1991 నుంచి గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత
1991 మేలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య అనంతరం నుంచి గాంధీ కుటుంబానికి ఎస్పీజీతో కూడిన భద్రతను ఏర్పాటు చేశారు. తాజాగా నవంబర్ 8వ తేదీన ఎస్పీజీ భద్రతను ఉపసంహరిస్తూ హోంశాఖ నిర్ణయం తీసుకొన్నది. ప్రస్తుతం ప్రధాని భద్రతకు 3వేల మందితో కూడిన ఎస్పీజీ రక్షణ సిబ్బంది విధుల్లో ఉన్నారు.