బాబ్రీని కూల్చింది కాంగ్రెస్ పార్టీయే - ఇక ఏ మసీదు జోలికెళ్లం - వినయ్ కతియార్ కామెంట్స్..
అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతలో బీజేపీ, ఆరెస్సెస్, భజరంగ్ దళ్ నేతల పాత్ర లేదని, ఇందులో ఎలాంటి కుట్రా జరగలేదని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. బాబ్రీ మసీదు కూల్చిందెవరో దేశ ప్రజలంతా చూశారని ఇప్పటికే ముస్లిం సంఘాలు గుర్తుచేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అప్పటి బాబ్రీ కూల్చివేత ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన భజరంగ్దళ్ నేత వినయ్ కతియార్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాబ్రీ మసీదు కూల్చివేసింది కాంగ్రెస్ పార్టీయేనని, యూపీలో కళ్యాణ్ సింగ్ నేత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కాంగ్రెస్ ఈ కుట్ర పన్నిందని తాజాగా వినత్ కతియార్ సంచలన కామెంట్స్ చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన రోజుకు ముందు రోజు తామంతా అయోధ్యలో సమావేశమైన మాట వాస్తవమే కానీ, కరసేవ ఎలా చేయాలనే దానిపైనే తాము చర్చించామని చెప్పుకొచ్చారు. మసీదు కూల్చివేత నిర్ణయం తీసుకోలేదన్నారు. నిన్న సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పులోనూ ఇదే విషయం స్పష్టమైందన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రపై దర్యాప్తుకు వినత్ కతియార్ డిమాండ్ చేశారు.
Recommended Video
ప్రస్తుతం కాశీ, మధురలో మసీదుల స్ధానంలో ఆలయాల నిర్మాణ యాజమాన్య హక్కుల కోసం జరుగుతున్న పోరాటంపై సాధువులతో చర్చిస్తామన్నారు. తాజా డిమాండ్లపై స్పందిస్తూ భవిష్యత్తులో ఏ మసీదునూ కూల్చే ఆలోచనలు లేవన్నారు. దేశంలో శాంతి వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు కతియార్ పేర్కొన్నారు. సీబీఐ కోర్టు తీర్పు బీజేపీ నేతలకు ఊరటనిచ్చిన నేపథ్యంలో కతియార్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.