పాక్ను కాంగ్రెస్ ఎందుకు వెనకేసుకొస్తోంది..సర్జికల్ స్ట్రైక్స్ తప్పవు: బీజేపీ
న్యూఢిల్లీ: పుల్వామా దాడులపై ప్రశ్నల వర్షం కురిపించిన కాంగ్రెస్పై ఎదురుదాడికి దిగింది బీజేపీ. పుల్వామా ఉగ్రదాడుల వెనక అసలు హస్తం ఎవరిది అనే అనుమానం కలుగుతోందని కాంగ్రెస్ నేత అధిర్ చౌధురి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మండిపడ్డారు. పుల్వామా దాడుల్లో అంతమంది జవాన్లు మరణిస్తే ఎవరిదో హస్తం ఉందని చెబుతున్న కాంగ్రెస్పై ప్రజాస్వామ్య సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఒక ప్రతిపక్ష పార్టీలా మసులు కోవడం లేదని , ఏదో కుట్రకు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోందని సంబిత్ పాత్ర అన్నారు.
ఇదే కాంగ్రెస్ నేత అయిన అధిర్ రంజన్ చౌదరి జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు విషయంలో కూడా ఎక్కువగా మాట్లాడారని సంబిత్ పాత్ర గుర్తుచేశారు. పాకిస్తాన్ను అడిగారా... యూఎన్ను అడిగారా, ఇది రెండుదేశాలకు సంబంధించిన విషయం అంటూ పార్లమెంటులో రభస చేశారని సంబిత్ పాత్ర చెప్పారు. పాకిస్తాన్ స్టాండ్ను భారత్లో ఉన్న కాంగ్రెస్ ఎందుకు తీసుకుంటోందని సంబిత్ పాత్ర ప్రశ్నించారు.
అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి ఉగ్రవాదంలో కూడా మతం కనిపిస్తోందని మండిపడ్డారు సంబిత్ పాత్ర. కాంగ్రెస్ వారు కాషాయ ఉగ్రవాదం, హిందూ ఉగ్రవాదం అని రెండు కొత్త అంశాలను కనుగొన్నారని చెప్పిన సంబిత్ పాత్ర... సోనియాగాంధీ ఆదేశాల మేరకు కాషాయ ఉగ్రవాదం అనే పదాన్నే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారని మండిపడ్డారు.
బాట్లా హౌజ్ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైతే సోనియాగాంధీ నిస్తేజానికి గురయ్యారని చెప్పిన సంబిత్ పాత్ర, జాతి వ్యతిరేక నినాదాలు చేస్తున్న వారి వద్దకు వెళ్లి రాహుల్ గాంధీ సంఘీభావం ప్రకటించారని మండిపడ్డారు సంబిత్ పాత్ర. పుల్వామా దాడులకు పాల్పడింది ఎవరు అనే సందేహం మీకు ఇంకా ఉందా అని ప్రశ్నించారు సంబిత్ పాత్ర. భారత ఆర్మీ, నిఘావర్గాలపై ఏమైనా అనుమానాలు ఉంటే కాంగ్రెస్ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలని చెప్పారు. పుల్వామా దాడులు పాకిస్తాన్ చేయలేదని భావిస్తే కాంగ్రెస్ ధైర్యంగా ముందుకొచ్చి చెప్పాలని సవాల్ విసిరారు. పుల్వామా దాడుల వెనక ఉన్న పాకిస్తాన్కు క్లీన్ చిట్ ఎందుకిస్తారు అని కాంగ్రెస్ను ప్రశ్నించారు.
Now question will certainly be arisen as to who were the real culprits behind the gruesome Pulwama incident, need a fresh look on it.
— Adhir Chowdhury (@adhirrcinc) January 14, 2020
(3/3)#DavindarSingh
అంతకుముందు ఉగ్రవాదులను తరలిస్తూ వారికి సహకరించిన డీఎస్పీ దవేందర్ సింగ్ గురించి కాంగ్రెస్ ప్రస్తావించింది. ఉగ్రవాదులకు ఇంటిదొంగలే సహకరిస్తున్నారని చెబుతూ పుల్వామా దాడులకు కూడా వీరే సహకరించి ఉంటారన్న అనుమానం వ్యక్తమవుతోందని కాంగ్రెస్ తెలిపింది. దీనిపై తిరిగి విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.