2జీ స్కాంపై డీఎంకే ఒత్తిడి: కాంగ్రెస్కు నష్టంపై వెనక్కి తగ్గిన రాజా
చెన్నై: 2జీ కుంభకోణంలో తన పాత్రను మాజీ మంత్రి ఏ రాజా 'టెల్-ఆల్ బుక్' అనే పుస్తక రూపంలో తీసుకొద్దామనుకునే ఆలోచనను విరమించుకున్నారా అంటే అవుననే అంటోంది తమిళ మీడియా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కుంభకోణలో ఏ రాజా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ కేసులో సీబీఐ ఆయన్ని అరెస్ట్ చేసి పలుమార్లు విచారించింది. ఈ విచారణలో ఆయన మాజీ ప్రధాని మన్మోహిసింగ్తో పాటు అప్పటి ఆర్ధికశాఖ మంత్రి చిదంబరం పేరుని కూడా ఈ కేసులో ప్రస్తావించారు. దీంతో కాంగ్రెస్ పెద్దలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
అయితే ఈకేసులో తప్పంతా తానొక్కడినే చేసినట్టు తన పేరుని నిందితుల జాబితాలో చేర్చడం, ఆ తర్వాత సీబీఐ అరెస్ట్ చేయడం, జైలుకు పంపించడం లాంటివి చేయడాన్ని ఓర్చుకోలేని ఏ రాజా 2జీ స్కాంకు సంబంధించి ఇన్సైడ్ స్టోరీ అంటూ తమిళంలో వ్రాతపతిని రాసుకున్నారు.
తమిళంలో ఉన్న ఈ వ్రాతపతిని ప్రముఖ జర్నలిస్ట్ పరన్ బాలకృష్ణన్ ఇంగ్లీషులోకి తజ్జుమా చేశారు. పెంగ్విన్ ఇండియా సంస్ధ 'మై డిఫెన్స్ బై రాజా' అనే పేరుతో ఈ పుస్తకాన్ని విడుదల చేసేందుకు ముందుకొచ్చింది. నిజానికి ఈ పుస్తకం 2015లో చివర్లో విడుదల కావాల్సి ఉంది.
ఈ విషయాన్ని ఏ రాజా పలు ఇంటర్యూల్లో ప్రస్తావించారు. అయితే కవర్ పేజి ఆలస్యంగా కారణంగా ఈ పుస్తకం విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది. ఈ పుస్తకం బయటకు వస్తే 2జీ కుంభకోణంలో పెద్దవాళ్ల పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంతో కాంగ్రెస్ అడ్డుకుంటోందని వార్తలు వినిపిస్తున్నాయి.
మొత్తం 288 పేజీలు కలిగి ఉన్న ఈ పుస్తకం ధరను రూ. 599గా నిర్ణయించారు. 2జీ కుంభకోణానికి సంబంధించిన కేసులో అప్పట్లో సీబీఐ ఏ రాజాను విచారించిన సమయంలో కొందరు కాంగ్రెస్ పెద్దలను కాపాడేందుకు నిందితుడు ప్రయత్నిస్తున్నాడంటూ స్వయంగా సీబీఐ అధికారులే వెల్లడించిన సంగతి తెలిసిందే.
2జీ కుంభకోణం: 'మన్మోహన్ను ఏ రాజా తప్పదోవ పట్టించారు'
అంతేకాదు ఈ 2జీ కుంభకోణం కేసు కాంగ్రెస్, డీఎంకేల మధ్య పెద్ద చిచ్చునే రేపింది. అయితే ఆ గొడవలన్నింటిని పక్కకుపెట్టి ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-డీఎంకే మిత్ర పక్షంగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశాయి. అయితే అధికారానికి కూత వేటు దూరంలో ఆగిపోయాయి.
ఇలా రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరిన నేఫథ్యంలో డీఎంకే సీనియర్ నేతలు ఏ రాజా పుస్తకం విడదల ప్రయత్నాన్ని విరమించుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. తన పుస్తక విడుదల విషమయై ఏ రాజా గత నెలలో డీఎంకే పెద్దలను కలిసి చర్చించినట్లుగా కూడా సమాచారం.
2జీ: ప్రధానికి ముందే తెలుసు, అబద్దమన్న కాంగ్రెస్
డీఎంకే సీనియర్ నేతల సూచన మేరకు తన పుస్తకం విడుదలను విరమించుకున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్-డీఎంకే భాగస్వామ్యం కారణంగా రాజా తన నిర్ణయాన్ని విరమించుకోవడం ఇదే మొదటి సారి కాదు. 2జీ కుంభకోణంలో కేసు విచారణ సందర్భంగా 2011లో మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్, మంతి చిదంబరంలను సాక్షులుగా విచారించాలని ఏ రాజా సంచనల వ్యాఖ్యలు చేశారు. అయితే కోర్టులో మాత్రం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.