బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్తో కాంగ్రెస్ పొత్తు... టీఎంసీ-బీజేపీ టఫ్ ఫైట్లో ప్రభావం చూపించగలరా..
వచ్చే ఏడాది జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి బరిలో దిగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం(డిసెంబర్ 24) బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి పొత్తు విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.'రాబోయే బెంగాల్ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తును కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ అధికారికంగా ఆమోదించింది.' అని అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. రాష్ట్ర రాజకీయం తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న తరుణంలో వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు ఎంతమేరకు సక్సెస్ అవగలదన్న చర్చ జరుగుతోంది.
లోక్సభ ఎన్నికల్లో పొత్తుకు ప్రయత్నించినా...
నిజానికి గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్-వామపక్షాలు పొత్తుతో బరిలో దిగేందుకు ప్రయత్నించాయి. కానీ సీట్ల కేటాయింపు కొలిక్కి రాకపోవడంతో పొత్తు కార్యరూపం దాల్చలేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు స్ధానాలతోనే సరిపెట్టుకోగా, లెఫ్ట్ఫ్రంట్ అసలు ఖాతా తెరవలేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లోనైనా కలిసి పోటీ చేయాలని రెండు పార్టీలు కొద్ది నెలలుగా ఆ దిశగా కసరత్తులు చేస్తున్నాయి. సెక్యులర్ పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాము సిద్దమని ఈ ఏడాది అక్టోబర్లోనే సీపీఎం సెంట్రల్ కమిటీ స్పష్టం చేసింది. తాజాగా పొత్తు కొలిక్కి రావడంతో ఇక సీట్ల కేటాయింపుపై ఇరు పార్టీలు ఫోకస్ చేసే అవకాశం ఉంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొత్తుతోనే...
2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వామపక్షాలు,కాంగ్రెస్ కలిసే పోటీ చేశాయి. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్లో ఇరువురు కలిసి 76 స్థానాలు దక్కించుకున్నారు. మొత్తంగా 38శాతం ఓటు బ్యాంకును తమ ఖాతాలో వేసుకున్నారు. ఇందులో వామపక్షాలకు 26శాతం ఓట్లు రాగా,కాంగ్రెస్ పార్టీకి కేవలం 12శాతం ఓట్లు వచ్చాయి. అయితే సీట్లు మాత్రం కాంగ్రెస్కు 44,వామపక్షాలకు 32 రావడం గమనార్హం. ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా చతికిలపడటంతో బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్తో పొత్తుకు రాష్ట్ర పార్టీ నేతలు పట్టుబట్టారు. దీంతో అధిష్టానం కూడా లెఫ్ట్ ఫ్రంట్తో కలిసి నడిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రభావం ఉంటుందా...?
గత లోక్సభ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపించని ఈ కూటమి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతమేర ప్రభావితం చూపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ మధ్య టఫ్ ఫైట్కి సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ పొత్తు ఎవరి విజయ అవకాశాలకు గండి కొట్టబోతుందన్న చర్చ కూడా జరుగుతోంది. బీజేపీ సైన్యమంతా ఇప్పటికే బెంగాల్లో మోహరించగా... అటు మమతా కాషాయ పార్టీని నిలువరించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇరువురిలో అంతిమ విజయం ఎవరిదో తేలాలంటే వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ వరకు వేచి చూడాల్సిందే.