ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఖాళీ చేయండి: మోడీ ప్రభుత్వం నోటీసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని నడిబొడ్డున గల కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయాలంటూ నరేంద్రమోడీ ప్రభుత్వం కాంగ్రెసుకు నోటీసు జారీ చేసింది. దీంతో పాటు కాంగ్రెసు పార్టీ ఆధీనంలో ఉన్న మరో మూడు ప్రభుత్వ భవనాలను సైతం ఖాళీ చేయాలని ఆదేశించింది.
24, అక్బర్ రోడ్డు; 5, రైజినా రోడ్డు; సి-2/109 చాణక్య పురి భవనాలను ఖాళీ చేయాలంటూ పట్టణాభివృద్ధి శాఖ తమకు నోటీసులు ఇచ్చిందని ఏఐసీసీ కోశాధికారి మోతీలాల్ వోరా తెలిపారు. 24, అక్బర్ రోడ్డు భవనంలో 1978 నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంగా కొనసాగుతోంది.
26, అక్బర్ రోడ్డులో సేవాదళ్, 5, రైజినారోడ్డులో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ కార్యాలయాలు ఉన్నాయి. చాణక్యపురి భవనాన్ని నివాసంగా వినియోగిస్తున్నారు. ఈ నోటీసు తమకు అందిందని, దీనికి సమాధానం కూడా పంపించామని ఆ పార్టీ నేత మోతీలాల్ వోరా వ్యాఖ్యానించారు.
మరో మూడేళ్ల పాటు భవనాన్ని వాడుకునేందుకు అనుమతి కోరినట్లు ఆయన తెలిపారు. దీంతో ఆ భవనాలను ఖాళీ చేసేంతవరకు జరిమానా రుసుము చెల్లించాలని పట్టణాభివృద్ధి శాఖ కాంగ్రెసు పార్టీని ఆదేశించింది.
ఈ భవంతిలో మొత్తం 5 ఫోర్లు ఉన్నాయి. జూన్, 2010లో కాంగ్రెస్ ఇక్కడ తన కార్యాలయాన్ని ప్రారంభించింది. తొలుత మూడేళ్లకు మాత్రమే అనుమతిచ్చిన అధికారులు 2013లో ఖాళీ చేయాలని కోరగా, మరో మూడేళ్లు పొడిగించాలని ఆ పార్టీ కోరింది. దీనిని పరిశీలించాలంటూ పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడు అధికారులను ఆదేశించారు.
నిజానికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం ప్రభుత్వం 9-ఏ, రౌజ్ అవెన్యూ వద్ద గల భూమిని కేటాయించింది. ఈ భూమిని 2010, జూన్లో కాంగ్రెస్ స్వాధీనం చేసుకుంది. మూడేళ్లలోగా నాలుగు భవనాలను ఖాళీ చేయాల్సి ఉన్నా, ఖాళీ చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నోటీసులు పంపించింది.