ఆ దేశంలో కాంగ్రెస్కు మంచి టీఆర్పీలు: జైట్లీ
ఢిల్లీ: జాతీయ భద్రతపై కాంగ్రెస్ మాట్లాడిన ప్రతిసారి మూలకు పడుతోందని అన్నారు ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ. కాంగ్రెస్ను ప్రజలు నమ్మడం లేదు కాబట్టే ప్రధాని నరేంద్ర మోడీపై రాఫెల్ విషయంలో రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారని అన్నారు. ఇక సుప్రీం కోర్టు, కాగ్లకంటే ఏ ఒక్కరి కుటుంబం ఎక్కువకాదని జైట్లీ కౌంటరిచ్చారు. మాటలు చాలా తక్కువగా ఉన్నాయని వారు చెప్పేదాంట్లో నిజాలు లేవని రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు జైట్లీ.
జమ్మూలో గ్రెనేడ్ దాడి వెనక ఈ ఉగ్రవాద సంస్థ హస్తం... ఉగ్రవాది యాసిర్ భట్ అరెస్టు
ఇప్పటి వరకు రాఫెల్ వివాదంలో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని... అవి ఎప్పటికప్పుడు రుజువవుతూ వస్తున్నాయని జైట్లీ అన్నారు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ బీజేపీపై ఆరోపణలు చేసి వారే కార్నర్ అవుతూ వచ్చారని ఎద్దేవా చేశారు జైట్లీ. అంతేకాదు... పాకిస్తాన్ టీవీల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి టీఆర్పీ రేటింగ్లు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. అక్కడ మంచి టీఆర్పీలు అయితే వస్తున్నాయి కానీ భారతదేశంలో మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని చెప్పారు.
మరోవైపు రాఫెల్కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. డాక్యుమెంట్లు నిజంగానే చోరీకి గురయ్యాయని జైట్లీ సమర్థించారు. ఓ పత్రిక దేశప్రయోజనాల దృష్ట్యా రహస్యంగా ఉడాల్సిన డాక్యుమెంట్లను చోరీ చేసి లీక్ చేసిందని అన్నారు జైట్లీ. ప్రెస్కు స్వాతంత్ర్యం ఉందని అయితే దేశరక్షణ వ్యవస్థకు సంబంధించి కొన్ని విషయాలు రహస్యంగా ఉంచాల్సిందే అని రాజ్యాంగం రూపకర్తలు కూడా చెప్పారని జైట్లీ గుర్తు చేశారు. దీన్ని గత 72 ఏళ్లుగా ఎవరూ సవాల్ చేయలేదని చెప్పారు. ఇక రాఫెల్ పై ఇప్పటికే ప్రభుత్వం అన్ని విషయాలను స్పష్టంగా చెప్పిందని జైట్లీ తెలిపారు.
ఇక ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ ఎప్పుడూ సుప్రీం కోర్టు తీర్పులను నమ్మరని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను విశ్వసించరని అన్నారు మరో మంత్రి రవిశంకర్ ప్రసాద్. అంతేకాదు ఫైటర్ జెట్కు సంబంధిచి పాకిస్తాన్ నుంచి సర్టిఫికేట్ కావాలేమో అని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులకంటే పాకిస్తాన్నే ఎక్కువగా నమ్ముతున్నట్లుందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.