శివసేన-ఎన్సీపీ కూటమికి కాంగ్రెస్ సూత్రప్రాయ అంగీకారం.. కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు ఇవే...
మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రపతి పాలనలోకి వెళ్లగా.. ఆయా పార్టీలు ఒక్కటవుతున్నాయి. శివసేన-ఎన్సీపీతో చేతులు కలుపడానికి కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా...
మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ కూటమి మద్దతుపై కాంగ్రెస్ పార్టీ నాన్చివేత ధోరణి అవలంభించింది. దీంతో గవర్నర్ కోషియారి ఇచ్చిన సమయం మించిపోవడం.. తర్వాత ఎన్సీపీకి ఛాన్స్ ఇవ్వడం.. రాష్ట్రపతి పాలన విధించడం చకచకా జరిగిపోయాయి. ఎన్సీపీ-కాంగ్రెస్ నేతలతో శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే ట్రైడంట్ హోటల్లో సుధీర్గంగా చర్చలు జరిపారు. దీంతో కూటమికి మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది.
కామన్ మినిమం ప్రోగ్రామ్...
కనీస ఉమ్మడి ప్రణాళిక మేరకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మేనిఫెస్టోలో తాము సూచించిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని మెలిక విధిస్తారు. ఇందులో ప్రధానంగా దళితులు, ఆదివాసీలు జీవన ప్రణామాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతోపాటు స్పీకర్ పదవీ కూడా తమకే ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కానీ దీనిపై కాంగ్రెస్-శివసేన స్పందించలేదు.
స్వాగతిస్తారు...
కాంగ్రెస్ పార్టీ శివసేనతో పొత్తు పెట్టుకుంటే ముస్లింలు కలత చెందరని ఆ పార్టీ సీనియర్ నేత తారిక్ అన్వర్ తెలిపారు. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమితో మైనార్టీలు ఎలాంటి ఆందోళనకు గురికారని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన ప్రాధామ్యం అభివృద్ధి మాత్రమేనని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్రం వెనకబాటుతనానికి బీజేపీ కారణమని ఆయన విమర్శించారు.
ముంబైకి ఎమ్మెల్యేలు
మరోవైపు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలు ఉంటుంది. ఈ క్రమంలో జైపూర్ రిసార్టులో ఉన్న 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరిగి ముంబై చేరుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటిలో హడావిడి ఏమీ ఉండని నేపథ్యంలో వారిని మహారాష్ట్ర తీసుకొచ్చారు. రాష్ట్రంలో కనీసం ఆరునెలలు రాష్ట్రపతి పాలన అమల్లో ఉండే అవకాశం ఉంది.