చాయ్వాలాకే జనం బాధలు తెలుసు -ఖడ్గమృగాలనూ కాంగ్రెస్ కాపాడలేదు -అస్సాంలో ప్రధాని మోదీ
దేశంలో పేదవాడి బాధలేంటో, అస్సాం తేయాకు తోటల కార్మిల వెతలు ఎలాంటివో చాయ్వాలానైన తనకు మాత్రమే తెలుసని, ఇతరులకు ఆ బాధలు తెలీదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ దేశాన్ని, అస్సాం రాష్ట్రాన్ని ఆగం పట్టిస్తున్నదని, వాళ్లవన్నీ తప్పుడు వాగ్ధానాలేనని మండిపడ్డారు.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం బొకాఖట్(గోలాగట్ జిల్లా)లో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. అస్సాంలో అధికారంలోకి వస్తే సీఏఏ నిలుపుదలతోపాటు 5 కీలక హామీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రధాని మండిపడ్డారు. కాంగ్రెస్ పేర్కొన్న 5 హామీలను అస్సామీలు నమ్మవద్దన్న మోదీ.. అవన్నీ తప్పుడు వాగ్దానాలని అన్నారు.
తిరుపతి పోరు: బీజేపీ సంచలనం -జనసేనకు విడిగా సొంత కమిటీ -దాసరికి చోటు -టికెట్ రత్నప్రభకే!
కాంగ్రెస్ హయాంలో అస్సాంలో అశాంతి రాజ్యమేలేదని, ఐదేళ్ల కిందట ఎన్డీఏ సర్కారు రాక తర్వాతే రాష్ట్రంలో శాంతి, సుస్థిరత నెలకొన్నాయని, కాంగ్రెస్ ఎంతసేపూ అస్సాంను లూటీ చేస్తూరాగా, ఎన్డీయే పాలనలో రాష్ట్రం అభివృద్ధిపరంగా కొత్తపుంతలు తొక్కిందని మోదీ చెప్పారు.
ప్రపంచ ప్రఖ్యాత ఒంటి కొమ్ము ఖడ్గమృగాలను సైతం కాంగ్రెస్ కాపాడలేకపోయేదని, బీజేపీ పాలనలో అక్రమ వేటగాళ్లను జైళ్లకు పంపిందని మోదీ గుర్తుచేశారు. అస్సాం సంస్కృతి, సంప్రదాయాలు, భాష, ఉత్సవాలు దేశానికి గర్వకారణమని, రాష్ట్ర ప్రజలు బీజేపీపై ఉంచిన నమ్మకాన్ని కాపాడటానికి కష్టించి పనిచేస్తున్నామని, గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి మరో ఐదేళ్లూ కొనసాగేలా ప్రజలు ఆశీర్వదించాలన్నారు.
గడిచిన ఐదేళ్లలో అసోంలో అటవీ ప్రాంతం విస్తరించామని, ఒక్క చమురు, గ్యాస్ రంగంలో రూ.40,000 కోట్లు ఇన్వెస్ట్ చేశామని, అసోం దర్శన్ పేరుతో 9,000 నామ్గర్లు, ఇతర మత సంస్థల్లో మౌలిక వసతులు కల్పించామని ప్రధాని చెప్పారు. టీ కార్మికులను ఏళ్ల తరబడి కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని, తాము టీ వర్కర్ల విద్య, ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. కాగా,
తేయాకు తోటల కార్మికులకు రూ.351 రూపాయల రోజువారీ వేతనం కల్పించడంలో ఆలస్యమైందని, ఈసారి బీజేపీ అధికారంలోకి రాగానే బకాయిలతోపాటు వేతనాల పెంపూ ఉంటుందని ప్రధాని హమీ ఇచ్చారు. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో మూడు విడతలుగా పోలింగ్ జరుగనుంది. తొలి విడత పోలింగ్ ఈనెల 27న జరుగుతుంది. ఫలితాలు మే 2న వెలువడుతాయి. అస్సాంతోపాటు పశ్చిమ బెంగాల్ లోనూ ప్రధాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.