రాఫెల్ డీల్, లోకసభలో రచ్చ: HAL సామర్థ్యంపై మీకే డౌట్.. కాంగ్రెస్ను దులిపేసిన నిర్మలా సీతారామన్
Recommended Video
న్యూఢిల్లీ: రాఫెల్ డీల్ అంశంపై లోకసభలో శుక్రవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దీనిపై జేపీసీ వేసేందుకు బీజేపీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ఆ తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు. అసలు యూపీఏ పదేళ్ల కాలంలో ఏం చేయలేదన్నారు.
యూపీఏ హయాంలో జరిగిన ఒప్పందంలో అనేక లోపాలు ఉన్నాయని చెప్పారు. దేశ రక్షణ కంటే వాళ్లకు ఖజానా రక్షణ ముఖ్యమని చెప్పారు. తమకు జాతీయ భద్రత ముఖ్యమన్నారు. ఒప్పందంలో రెండు పరిష్కారానికి నోచుకోని సమస్యలు ఉన్నాయని చెప్పారు. దసో, హెచ్ఏఎల్ మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదన్నారు.
రాహుల్ గాంధీ ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి
రాఫెల్ డీల్ పైన కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ఏమాత్రం సరికాదని నిర్మలా సీతారామన్ అన్నారు. ఒప్పదం జరిగిన మూడేళ్లలో తొలి విమానం అందుతుందని చెప్పారు. 2022లో చివరి విమానాన్ని అందజేస్తామని చెప్పారు. ఆరోపణలు చేసే ముందు రాహుల్ గాంధీ ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించారు. భారత్లో హెచ్ఏఎల్ ద్వారా 108 విమానాల తయారీకి దసో గ్యారెంటీ ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు హెచ్ఏఎల్ కోసం కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని ఆరోపించారు. రాఫెల్ ఒప్పందం మీ హక్కు అంటూ హెచ్ఏఎల్ కార్యాలయం ఎదుట ఖర్గే నినాదాలు చేశారని చెప్పారు.
హెచ్ఏఎల్ సామర్థ్యాన్ని మీరే ప్రశ్నించారు
హెచ్ఏఎల్ గొప్పల్నే తప్ప లోపాలను కాంగ్రెస్ ప్రస్తావించడం లేదని నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. హెచ్ఏఎల్ ఏడాదికి కేవలం 8 తేజాస్ విమానాలను తయారు చేయగలదని చెప్పారు. మా హయాంలో హెచ్ఏఎల్ సామర్థ్యాన్ని రెట్టింపు చేశామని చెప్పారు. 43 విమానాలకు ఆర్డర్ ఇస్తే హెచ్ఏఎల్ 8 విమానాలు మాత్రమే అందించిందని తెలిపారు. యూపీఏ తీరు వల్ల డిఫెన్స్ కొనుగోళ్లలో ప్రతిష్టంభన ఏర్పడిందన్నారు. అసలు హెచ్ఏఎల్ పనికిమాలిన సంస్థ అని యూపీఏనే చెప్పిందని, తాము మాత్రం దాని సామర్థ్యాన్ని పెంచామన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ హెచ్ఏఎల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రశ్నించిందని గుర్తు చేశారు.
కాంగ్రెస్ హయాంలో ఒక్క ఫైటర్ విమానం కొనుగోలు చేయలేదు
కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. అత్యవసరంగా రెండు స్క్వాడ్రోన్లను కొనుగోలు చేయగలమని చెప్పారు. ఒక్కో స్క్వాడ్రోన్లో 18 యుద్ధ విమానాలు ఉంటాయని చెప్పారు. 18 విమానాల స్థానంలో 36 విమానాలు కొనుగోలు చేయాలని తాము నిర్ణయించామని చెప్పారు. యూపీఏ ఒక స్క్వాడ్రోన్ కొనుగోలు చేయాలనుకుంటే తాము రెండు కొంటున్నామని చెప్పారు. కాంగ్రెస్ తమ పదేళ్ల హయాంలో ఒక్క ఫైటర్ విమానం కొనుగోలు చేయలేదన్నారు.
రాఫెల్ సరే.. అగస్టా వెస్ట్ల్యాండ్ మాటేమిటి
డిఫెన్స్ కొనుగోళ్లలో కాంగ్రెస్ పార్టీవి అన్నీ దురుద్దేశ్యాలేనని నిర్మల అన్నారు. హెచ్ఏఎల్కు బీజేపీ సర్కార్ ఇచ్చినన్ని కాంట్రాక్టులు యూపీఏ కూడా ఇవ్వలేదని చెప్పారు. మన్మోహన్ సింగ్ హయాంలో డిఫెన్స్కు చేసింది ఏమీ లేదని చెప్పారు. అసలు అగస్టా వెస్ట్ ల్యాండ్ చాపర్స్ను హెచ్ఏఎల్కు మీరు ఎందుకు ఇవ్వలేదని, మీరు హెచ్ఏఎల్కు ఇవ్వకుండా ఇప్పుడు రాఫెల్ విషయంలో మమ్మల్ని ప్రశ్నించడం ఏమిటన్నారు.'
హెచ్ఏఎల్ బాగు కోసం మీరేం చేశారు
హెచ్ఏఎల్ బాగు కోసం యూపీఏ చేసిందేమీ లేదని నిర్మలా సీతారామన్ చెప్పారు. రాఫెల్ తయారీ హెచ్ఏఎల్ జన్మహక్కా అన్నారు. 2022 కల్లా 365 రాఫెల్ విమానాల డెలివరీ ఉంటుందని చెప్పారు. యూపీఏ హయాంలో ఒక్క ఫైటర్ విమానం కొనలేదని, 'డబ్బుల్లేవ్' కాబట్టే కొనడం లేదని నాటి రక్షణ మంత్రి అన్నారని చెప్పారు. రాబర్డ్ వాద్రాకు కమీషన్ రాలేదని కొనలేదా అన్నారు. రాఫెల్ డీల్కు మోకాలడ్డింది కాంగ్రెస్ అన్నారు. యూపీఏ మతలబులు రాఫెల్కు అర్థం కాలేదన్నారు. డిఫెన్స్ డీల్ కాంగ్రెస్కు సంతృప్తికరంగా ఉంటేనే కొంటారా అన్నారు. యూపీఏ హయాంలో కమీషన్లపై లెక్క కుదరలేదు కాబట్టే కొనలేదా అన్నారు. హాలెండీ వ్యాఖ్యలపై రాహుల్ తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పారు. హోలెండీతో భేటీని రాహుల్ గాంధీ ధ్రువీకరించాలన్నారు. మాజీ రక్షణ మంత్రి సభలో మాట్లాడుతుంటే పేపర్ ప్లేన్లు విసిరారన్నారు. మాజీ రక్షణ మంత్రి ఏం మాట్లాడుతున్నారో వినే ఓపిక వాళ్లకు లేదన్నారు. కాగా నిర్మల తన పేరును ప్రస్తావించడంపై రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు.