ములాయంను చంపేందుకు కాంగ్రెస్ కుట్ర: మోడీ సంచలన ఆరోపణ
తనను హత్య చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని 1984లో ఎస్పీ అధినేత ములాయం సింగ్ స్వయంగా వాపోయారని మోడీ గుర్తుచేశారు.
కనౌజ్: అధికారాన్ని చేజెక్కించుకోవడం కోసం ఏకంగా తండ్రి హత్యకు కుట్ర చేసిన పార్టీతోనే అఖిలేష్ పొత్తు పెట్టుకున్నారని ప్రధాని మోడీ సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని చిబ్రాము నియోజకవర్గంలోని గుర్సాయ్ గంజ్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.
తనను హత్య చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని 1984లో ఎస్పీ అధినేత ములాయం సింగ్ స్వయంగా వాపోయారని మోడీ గుర్తుచేశారు. ములాయం మీద హత్యాయత్నం జరిగిన తర్వాత చరణ్ సింగ్, వాజ్ పేయి కలిసి రాష్ట్రాయ లోక్ తాంత్రిక్ మోర్చాను ప్రారంభించి కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమాన్ని ఉధృతం చేశారని పేర్కొన్నారు.
అవన్నీ మరిచిపోయి తండ్రిని చంపడానికి కుట్రచేసినవాళ్లతోనే యూపీ సీఎం అఖిలేష్ చేతులు కలిపారని మోడీ ఆరోపించారు. ములాయంపై జరిగిన హత్యాయత్నాన్ని వివరిస్తూ.. 1984, మార్చి 4న ఇటావా నుంచి లక్నో వెళ్తున్న సమయంలో ములాయం కారుపై కొంతమంది గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారని గుర్తుచేశారు.
ఆ కేసుకు సంబంధించి అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓ యాదవ వర్గ నాయకుడి పేరు తెరపైకి వచ్చిందన్నారు. ఇటీవల ఎస్పీలో రేగిన ముసలం సమయంలోను ములాయం ఈ విషయాన్ని ప్రస్తావించారని మోడీ అన్నారు.
కాంగ్రెస్ నయవంచక పార్టీ అన్న విషయం అఖిలేష్ కు తెలియదు గానీ ఆయన తండ్రి ములాయంకు మాత్రం తెలుసు అని మోడీ తెలిపారు. సీఎం కుర్చీ కోసం ఇంతటి దిగజారుడుకు పాల్పడుతారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఒడిలో కూర్చునేముందు అప్పటి ఘటన గురించి ఒకసారి ఆలోచించుకోవాలని మోడీ సూచించారు.
ఇక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సైతం మోడీ ఎద్దేవా చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిని తాను గౌరవిస్తానని రాహుల్ పేర్కొనడం ద్వారా ఒక కాలు సమాజ్ వాదీ పడవలోను, మరో కాలు బీఎస్పీ పడవలోను వేశారని ఎద్దేవా చేశారు.