బలపరీక్షలో గెలిచిన రావత్: ఆయనే సీఎం, సంబరాలు
న్యూఢిల్లీ: మంగళవారం ఉత్తరాఖండ్లో జరిగిన బలపరీక్షలో హరీశ్ రావత్ విజయం సాధించారు. ఈ మేరకు బలపరీక్షలో ఆయన విజయం సాధించినట్టు సుప్రీం కోర్టు అధికారికంగా ప్రకటించింది. బలపరీక్షలో హరీశ్ రావత్కు అనకూలంగా 33 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 28 ఓట్లు పడ్డాయి.
దీంతో హరీశ్ రావత్ మెజారిటీ సాధించారని ఏజీ సుప్రీం కోర్టుకు తెలిపారు. దీంతో ఉత్తరాఖండ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. కాగా, ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తామని కేంద్ర ప్రభుత్వం తరుపున అడ్వేకేట్ జనరల్ సుప్రీం కోర్టుకు వివరించారు.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మంగళవారం బలపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వివరాలను సీల్డు కవర్లో సుప్రీం కోర్టు ధర్మాసనానికి సమర్పించగా బుధవారం ఫలితాన్ని ప్రకటించింది. రావత్ గెలిచినట్టు ధర్మాసనం ప్రకటించడంతో ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తామని కోర్టుకు ఏజీ తెలిపారు.
బలపరీక్షలో రావత్ గెలవడంతో ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ వర్గాలు విజయోత్సవాలు చేసుకుంటున్నాయి. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు ఉండగా 9 మంది కాంగ్రెస్ రెబెల్స్పై సుప్రీం ఓటింగ్లో పాల్గొనకూడదంటూ అనర్హత వేటు వేసింది.
దీంతో మిగిలిన 61 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొన్నారు. వీరిలో బీజేపీకి 28, కాంగ్రెస్కు 27, బీఎస్పీకి ఇద్దరు, ఉత్తరాఖండ్ క్రాంతి దళ్కు ఓ ఎమ్మెల్యే, మరో ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రేఖ ఆర్య ఓటింగ్కు ముందు బీజేపీలో చేరారు.
అదే విధంగా బీజేపీ ఎమ్మెల్యే భీమ్ లాల్ ఆర్య కాంగ్రెస్లో చేరారు. ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు మద్దతు తెలిపారు. దీంతో హరీశ్ రావత్కు 33 ఓట్లు పడి బలపరీక్షలో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో రావత్ ప్రభుత్వం మైనార్టీలో పడిన సంగతి తెలిసిందే.
దీంతో ఉత్తరాఖండ్లో మార్చి 27న రాష్ట్రపతి పాలన విధించారు. అయితే తాజాగా బలపరీక్షలో హరీశ్ రావత్ విజయం సాధించడంతో అక్కడ రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్లు కేంద్రం తరుపున ఏజీ సుప్రీం కోర్టుకు తెలిపారు.