రాహుల్ వైఫల్యం!: మాకు ఫోన్ చేయలేదే.. ఏఏపీ తర్వాత టీఆర్ఎస్ ప్రశ్న
న్యూఢిల్లీ/హైదరాబాద్: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ వైఫల్యం మరోసారి బయటపడిందని అంటున్నారు. ఈ ఓటమి స్వయంకృపరాధమే అని చెబుతున్నారు. ఓ వైపు ఎన్డీయే అభ్యర్థిని గెలిపించుకునేందుకు ప్రధాని మోడీ, బీహార్ సీఎం నితీష్ కుమార్లు పలువురు పార్టీ అధినేతలకు ఫోన్ చేస్తే, రాహుల్ మాత్రం అలా చేయలేదని అంటున్నారు.
దీనిపై తెరాస ఎంపీ కే కేశవ రావు శుక్రవారం స్పందించారు. టీఆర్ఎస్ మద్దతు కోసం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫోన్ చేశారని ఆ పార్టీ ఎంపీ కే కేశవ రావు చెప్పారు. మరి తమకు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఫోన్ చేసి ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీని కూడా రాహుల్ మద్దతు అడగలేదన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు ఫోన్ చేసి మద్దతు కోసం అభ్యర్థించారు. బీజేడీ మద్దతు లేకుంటే హరివంశ్ సింగ్ ఎన్నిక కష్టంగా మారేది. ఇలాంటి సమయంలో మోడీ, నితీష్లు మద్దతు కూడగట్టారు.
రాజ్యసభ ఎన్నికలను ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కరించింది. రాహుల్ గాంధీ సభలో ప్రధాని మోడీకి హగ్ ఇస్తారు కానీ, మద్దతు కోసం అరవింద్ కేజ్రీవాల్కు ఫోన్ చేయకపోవడం ఏమిటని ఏఏపీ ప్రశ్నించింది. అందుకే తాము ఎవరికీ మద్దతివ్వలేదని తేల్చి చెప్పింది. రాహుల్ పలు ప్రాంతీయ పార్టీలను దూరం పెట్టారు. వైయస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేడీ, ఏఏపీ వంటి పార్టీలను సంప్రదించలేదు.
వారు తమకే ఓటు వేస్తారని కాంగ్రెస్ భావించింది. కానీ వైసీపీ, ఏఏపీ ఓటింగ్కు దూరం జరగగా.. బీజేడీ, టీఆర్ఎస్లు ఎన్డీయే అభ్యర్థికి ఓటు వేశాయి. రాహుల్ కనీసం వారిని సంప్రదించకపోవడం వల్లే ఇలా జరిగిందని ఏఏపీ, తెరాస నేతల మాటలను బట్టి తెలుస్తోంది.