కాంగ్రెస్ను కుదిపేస్తోన్న మూకుమ్మడి రాజీనామాలు..ఎందుకో తెలుసా..?
న్యూఢిల్లీ: కాంగ్రెస్లో హై డ్రామా చోటు చేసుకుంటోంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఆ పార్టీలో పలు కీలక పదవుల్లో ఉన్న వారు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. వారు చేసిన సంతకాలు ఉన్న పత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.దాదాపు 80 మంది పార్టీ నేతల మూకుమ్మడి రాజీనామాలు అందులో ఉన్నాయి. రాహుల్ గాంధీ రాజీనామాకు నిరసనగా తమ పదవులకు కూడా రాజీనామా చేస్తున్నట్లు రాసి ఉన్న లేఖపై కాంగ్రెస్ నేతలు తమ సంతకాలను పెట్టారు. సంతకాలు చేసిన వారిలో ఏఐసీసీ సెక్రటరీలు, యూత్ కాంగ్రెస్ నేతలు, మహిళా కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లు ఉన్నారు.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యం తర్వాత రాహుల్ గాంధీ బాధ్యత తీసుకుంటూ రాజీనామా చేశారు. అయితే రాహుల్ గాంధీ తిరిగి కొత్త రక్తంతో పార్టీని నింపాలంటూ అది కూడా ఎవరి ప్రమేయం లేకుండా తానే తన కొత్త జట్టును ఏర్పాటు చేసుకోవాలంటూ కోరుతూ మూకుమ్మడి రాజీనామాలు కాంగ్రెస్ నేతలు చేసినట్లు సమాచారం. గురువారం రాత్రి కాంగ్రెస్ నేత వివేక్ టంకా తన లా అండ్ ఆర్టీఐ సెల్ ఛైర్మెన్ పదవికి రాజీనామా చేయడంతో ఇతర కాంగ్రెస్ నేతలు కూడా తాము రిజైన్ చేస్తున్నట్లు తెలిపారు.ఆ తర్వాత ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానాలోని కాంగ్రెస్ నేతలు కూడా తమ రాజీనామాలను ప్రకటించారు.
Recommended Video
రాహుల్ గాంధీని తిరిగి కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగాలని పార్టీలో పోరాటతత్వం తిరిగి తీసుకురావాలని రాజీనామా చేసిన తర్వాత వివేక్ టంకా కోరారు. రాహుల్ గాంధీని తిరిగి కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగించుకోవాలంటే అంతా రాజీనామాలు చేయాల్సిందేనంటూ వివేక్ టంకా ట్వీట్ ద్వారా తన సహచరులకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ఉత్తర్ప్రదేశ్ జిల్లా కాంగ్రెస్ కమిటీలను రద్దు చేస్తున్నట్లు కాంగ్రెస్ ఈ వారంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తను కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగాలని సీడబ్ల్యూసీ చెబుతున్నప్పటికీ తాను మాత్రం కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వీడేందుకే నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్కు తెలిపారు.