ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ గంపెడాశ! త్రీ డిజిట్ మార్క్ క్రాస్ చేస్తామని ధీమా!
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియక ముందే విజయావకాశాలపై అన్ని పార్టీలు ఓ అంచనాకు వస్తున్నాయి. ఇంకా మూడు దశల పోలింగ్ మిగిలి ఉండగానే ఫలితాల్లో తమ స్థానం ఏమిటో లెక్కలేసుకుంటున్నాయి. నాలుగు దశల ఎన్నికల పోలింగ్ సరళి ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆశిస్తోంది. త్రీ డిజిట్ మార్కు దాటడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది.
యూపీలో కాంగ్రెస్ స్ట్రాటజీ : బలహీనస్థానాల్లో కూటమి అభ్యర్థులకు సపోర్ట్, ఇంటర్వ్యూలో రాహుల్
త్రీ డిజిట్ మార్క్
కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అంతర్గత విశ్లేషణలో కాంగ్రెస్ విజయావకాశాలు పెరిగాయన్న అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. 2014లో మోడీ ఛరిష్మాతో బీజేపీ విజయ దుందుభి మోగించడంతో 543స్థానాల్లో కేవలం 44 సీట్లకే పరిమితైన కాంగ్రెస్ ఈసారి త్రీ డిజిట్ మార్కు దాటడం ఖాయమని ధీమాతో ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, ఏపీ, ఢిల్లీ, ఒడిశా రాష్ట్రాల్లో కనీసం ఖాతా తెరవలేదు. మరికొన్ని రాష్ట్రాల్లో డబుల్ డిజిట్ మార్కును దాటలేకపోయింది. ఫలితంగా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాను సైతం సాధించలేకపోయింది.
రాష్ట్రాల్లో మెరుగైన పరిస్థితి
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ తనకు పరిస్థితి అనుకూలంగా ఉందని భావిస్తోంది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ రాష్టాల్లో కాంగ్రెస్ వైపు గాలి వీస్తోందన్న ధీమాతో ఉంది. అయితే ఏపీ, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాలపై మాత్రం కాంగ్రెస్ ఎలాంటి ఆశలు పెట్టుకోవడం లేదు.
క్షేత్ర స్థాయి పరిశీలన
దేశంలోని వివిధ లోక్సభ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించిన అనంతరం కాంగ్రెస్ త్రీ డిజిట్ క్రాస్ చేస్తామన్న అంచనాకు వచ్చింది. చివరి విడత ఎన్నికలు పూర్తైన తర్వాత మరోసారి విశ్లేషణ జరపాలని భావిస్తోంది. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఫలితంగా కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారం చేపట్టడం కష్టమేనని అంటోంది. ఇదిలా ఉంటే త్రీ డిజిట్ మార్క్ క్రాస్ చేస్తామన్న కాంగ్రెస్ ప్రకటనపై స్పందించేందుకు బీజేపీ నిరాకరించింది.