బీజేపీదే ఆధిక్యం కానీ, జేడీఎస్ కింగ్! కాంగ్రెస్కు 78: అదునుచూసి దెబ్బకొట్టిన అమిత్ షా
బెంగళూరు: ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి కర్నాటక రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఫలితాలు మొదలు ప్రభుత్వ ఏర్పాటు వరకు ట్విస్టుల మీద ట్విస్టులతో కొనసాగుతోంది. కర్నాటకలో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. ఎక్కువ సర్వేలు చెప్పినట్లుగా హంగ్ వచ్చింది.
కర్నాటకలో బీజేపీకి షాక్, ఊహించని మలుపు: మళ్లీ హంగ్
మేజిక్ ఫిగర్ 112
222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మేజిక్ ఫిగర్ 112. బీజేపీకి 112, కాంగ్రెస్ పార్టీకి 78, జేడీఎస్కు 38, ఇతరులకు రెండు స్థానాలు దక్కాయి. ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ దక్కక పోవడంతో అసలు గేమ్ అక్కడే మొదలైంది. బీజేపీకి కేవలం ఎనిమిది సీట్లు మాత్రమే తక్కువపడ్డాయి. దీంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారని బీజేపీ అంటోంది. మరోవైపు జేడీఎస్ - కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదిపాయి.
అనూహ్య మలుపు
జేడీఎస్ ఏ సమయంలోను బీజేపీతో చర్చలు జరపకుండా ఉండేందుకు కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ -జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించాయి. అదే సమయంలో బీజేపీ అధినేత అమిత్ షా పావులు కదిపారు. బీజేపీ నేత యెడ్యూరప్ప గవర్నర్ను కలిసి తనకు దేవేగౌడ పెద్ద కొడుకు రేవణ్ణ మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరారు. దీంతో అనూహ్య మలుపు తిరిగింది.
అక్కడే బీజేపీకి అవకాశం చిక్కిందా?
రాజకీయపరంగా దేవేగౌడ కుటుంబంలో మూడు గ్రూపులు ఉన్నాయని అంటారు. దేవేగౌడ, రేవణ్ణ, కుమారస్వామి వర్గాలు. కుమారస్వామికి కాంగ్రెస్ సీఎం పదవి ఇస్తానని చెప్పడంతో బీజేపీ చక్రం తిప్పి రేవణ్ణను తమ వైపు తిప్పుకుందా అనేది తేలాల్సి ఉంది. యెడ్డీ మాత్రం రేవణ్ణతో పాటు 12 మంది తమ వెంట ఉన్నారని చెబుతున్నారు.
12 మంది బీజేపీ వైపు వెళ్లిపోతే
యెడ్యూరప్ప చెప్పినట్లుగా బీజేపీ వైపు 12 మంది ఎమ్మెల్యేలు ఉంటే జేడీఎస్కు మిగిలేది 26 మందే. అప్పుడు కాంగ్రెస్, జేడీఎస్ కలుపుకుంటే 104 అవుతుంది. అదే బీజేపీ బలం 116 అవుతుంది. దీంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఇందుకోసం రేవణ్ణ వర్గానికి మంత్రి పదవులుఎరగా వేసిందని తెలుస్తోంది. రేవణ్ణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఎరగా వేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు చీలికను అడ్డుకునేందుకు కుమారస్వామి ప్రయత్నాలు చేస్తున్నారు.