సుప్రీం ఎఫెక్ట్: హైద్రాబాద్ నుండి కర్ణాటకకు కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేలు
బెంగుళూరు:కర్ణాటక రాష్ట్రంలో బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మే 19 వ, తేదిన బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తరుణంలో హైద్రాబాద్ లో ఉన్న కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేలు కర్ణాటకకు తిరిగి వెళ్ళనున్నారు. శుక్రవారం ఉదయం లేదా రాత్రి పూట ఎమ్మెల్యేలంతా కర్ణాటకకు తిరిగి వెళ్ళే అవకాశం ఉంది.
కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప మే 19వ తేది సాయంత్రం 4 గంటలకు బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపిని గవర్నర్ పిలవడంపై కాంగ్రెస్, జెడి(ఎస్) నేతలు సుప్రీం కోర్టులో మే 16వ తేది అర్ధరాత్రి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం నాడు ఉదయం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈ వాదనలపై బిజెపి, కాంగ్రెస్ తరుపున వాదనలను విన్పించారు.
మరో వారం రోజుల పాటు సమయం ఇవ్వాలని బిజెపి తరపున న్యాయవాదులు కోరారు. అయితే మే 19వ తేది సాయంత్రం కూడ బలపరీక్ష నిర్వహించిన తమకు ఇబ్బంది లేదని కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులు ప్రకటించారు. అయితే ఈ తరుణంలో హైద్రాబాద్ లో ఉన్న కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేలు కర్ణాటకకు తిరిగి వెళ్ళనున్నారు.
శుక్రవారం సాయంత్రానికి కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యేలంతా హైద్రాబాద్ నుండి తిరిగి వెళ్ళే అవకాశం లేకపోలేదు. బలపరీక్షకు ముందే ఎమ్మెల్యేలంతా ప్రమాణస్వీకారం చేయాలి. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారానికి ముందు ప్రోటెం స్పీకర్ ఎన్నిక జరగాలి.
ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక జరగాల్సి ఉంది. ఆ తర్వాత స్పీకర్ అసెంబ్లీలో బలనిరూపణ వ్యవహరం ఉంటుంది.అసెంబ్లీలో బలనిరూపణ వ్యవహరం లో స్పీకర్ పాత్ర కీలకంగా మారనుంది. అయితే స్పీకర్ గా ఎవరు ఎన్నికౌతారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే కర్ణాటక లో మాత్రం ప్రోటెం స్పీకర్ మాత్రమే అసెంబ్లీలో బలనిరూపణ వ్యవహరాన్ని పర్యవేక్షించనున్నారు. అంతేకాదు ప్రోటెం స్పీకర్ ను ఎన్నుకోవాల్సి ఉంది.