హైదరాబాద్కు మారిన కర్ణాటక రాజకీయం: ప్రముఖ హోటళ్లకు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు
బెంగళూరు/హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాల నుంచి కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు నానా తంటాలు పడుతున్నాయి. బెంగళూరులోని హోటళ్లలో ఉంటే తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎలాగైనా లాగేస్తారని అంచనాకు వచ్చిన కాంగ్రెస్, జేడీఎస్లు కేరళలోని కొచ్చి లేదా తెలంగాణలోని హైదరాబాద్ తరలించాలని నిర్ణయించాయి.
మొదట కేరళకే తరలించాలని నిర్ణయించినా గురువారం రాత్రి నిర్ణయం మార్చుకున్న కాంగ్రెస్, జేడీఎస్ లు.. తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు ప్రైవేటు టావెల్స్లో తరలించాయి. శర్మ ట్రావెల్స్, ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సులో ఎమ్మెల్యేలను తరలించినట్లు తెలుస్తోంది.
కర్నూలు-హైదరాబాద్ మార్గం గుండా బస్సులు వచ్చాయి. శుక్రవారం ఉదయం 9.50గంటల వరకు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. వీరందరికి నగరంలోని ప్రముఖ హోటళ్లలో బస ఏర్పాట్లు చేశారు.
కాగా, జేడీఎస్ ఎమ్మెల్యే థామస్ కూడా ఈ మేరకు ధృవీకరించడం గమనార్హం. ఇది ఇలా ఉంటే, ఎమ్మెల్యేల బస ఏర్పాట్లను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యేలు బస చేసే హోటళ్ల ముందు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
#WATCH Congress MLAs changing buses on #Hyderabad Highway. The MLAs along with JD(S) MLAs will be staying in Hyderabad #KarnatakaElections2018 pic.twitter.com/eUk3dFd4yq
— ANI (@ANI) May 17, 2018
ఎన్నికల తర్వాత 104స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ గురువారం కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, బీజేపీ బలనిరూపణ ఎదుర్కొవాలంటే ఇంకా ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఇప్పటికే స్వతంత్ర ఎమ్మెల్యే బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి మంది 78, జేడీఎస్కు చెందిన 38మంది, ఇద్దరు స్వతంత్రులు తాజా ఎన్నికల్లో గెలుపొందారు.