అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు ఢుమ్మా, ముంబైలో జల్సా, వేటు పడుతుందోని భయం!
బెంగళూరు/ముంబై: కర్ణాటకలో రాజకీయ హైడ్రామాలు థ్రిల్లర్ సినిమాలను తలతన్నుతున్నాయి. జులై 12వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న కర్ణాటక శాసన సభ సమావేశాలను త్వరలోనే అంతం అయ్యే అవకాశం ఉందని స్పష్టంగా కనపడుతోంది. అసెంబ్లీ సమావేశాలకు ఢుమ్మా కొట్టిన రెబల్ ఎమ్మెల్యేలు ముంబైలో జల్సా చేస్తున్నారు.
శాసన సభ సమావేశాలు ప్రారంభం అయినా రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీలో అడుగుపెట్టం అంటున్నారు. శాసన సభ సమావేశాలకు హాజరై ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వెయ్యాలని ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు రెబల్ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశాయి.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ముంబై నుంచి బెంగళూరు వచ్చిన రెబల్ ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం స్పీకర్ రమేష్ కుమార్ కు మరోసారి రాజీనామా లేఖలు ఇచ్చారు. స్పీకర్ రమేష్ కుమార్ కు రాజీనామా లేఖలు ఇచ్చిన వెంటనే రెబల్ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో ముంబై చెక్కేశారు
శాసన సభ సమావేశాలకు హాజరై ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వెయ్యకుంటే మిమ్మల్ని అనర్హులను చెయ్యడానికి చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు రెబల్ ఎమ్మెల్యేలను హెచ్చరించాయి. అయితే హెచ్చరికలు లెక్కచెయ్యని రెబల్ ఎమ్మెల్యేలు మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అంటూ ముంబైలోని స్టార్ హోటల్ లో ఎంజాయ్ చేస్తున్నారు.
విప్ జారీని లెక్కచెయ్యని రెబల్ ఎమ్మెల్యేలను అనర్హులను చేస్తే ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి శాసన సభలో విశ్వాస తీర్మానంలో నెగ్గవలసి ఉంది. అయితే సీఎం కుమారస్వామికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు మాత్రం లేదు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. శుక్రవారం రెబల్ ఎమ్మెల్యేల అర్జీని విచారించి సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.