Punjab CM: పొలిటికల్ థ్రిల్లర్: తెర మీదికి అనూహ్య పేరు: గాంధీ కుటుంబానికి రైట్హ్యాండ్
చండీగఢ్: వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న పంజాబ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోన్నాయి. అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ పొలిటికల్ హైడ్రామాకు కేంద్రబిందువుగా మారుతున్నాయి. తొలుత- పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధు పేరును ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేయడంతోనే భారీ మార్పులు ఉండొచ్చనే సంకేతాలు వెలువడ్డాయి.
సమూల మార్పు..
దీనికి అనుగుణంగా ఏకంగా ముఖ్యమంత్రినే మార్చేసింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కేప్టెన్ అమరీందర్ సింగ్ సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటుందని తొలుత వార్తలొచ్చాయి. అంచనాలు వెలువడ్డాయి. మార్పులనేవి పీసీసీ అధ్యక్ష పదవి, పార్టీపరంగానే ఉంటాయని భావించారు విశ్లేషకులు. వాటన్నింటినీ పటాపంచలు చేసింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. ముఖ్యమంత్రి కేప్టెన్ అమరీందర్ సింగ్పై వేటు వేసింది.
ఈ మధ్యాహ్నానికి
శనివారం నాడే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆయన వారసుడిగా కాంగ్రెస్ పార్టీ కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సి ఉంది. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియ- ఇంకాస్సేపట్లో ఆరంభం కానుంది. కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం కానుంది. కేంద్ర పరిశీలకులుగా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్రమంత్రులు హాజరు కానున్నారు. ఈ మధ్యాహ్నానికి కొత్త ముఖ్యమంత్రి ఎవరో ఖరారు కానుంది.
లిస్ట్ పెద్దదే..
ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కొన్ని పేర్లను పరిశీలిస్తోంది. సునీల్ జక్కర్, ప్రతాప్ బజ్వా, సుఖ్జీందర్ సింగ్ రంధవా, సుఖ్బీందర్ సింగ్ సర్కారియా, త్రిప్త్ రాజీందర్ బజ్వా పేర్లు వినిపిస్తోన్నాయి. సునీల్ జక్కర్ ఫ్రంట్ రన్నర్గా ఉంటూ వచ్చారు. పీసీసీ మాజీ అధ్యక్షుడాయన. ప్రస్తుతం పీసీసీ సారథ్య బాధ్యతలను వహిస్తోన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు పేరు కూడా జోరుగా ప్రచారంలో ఉంది. ఒకరిద్దరు కేంద్ర మాజీమంత్రుల పేర్లను కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.
మరో కొత్త ముఖం..
వాటన్నింటినీ కాదని మరో కొత్త ముఖాన్ని తెర మీదికి తీసుకొచ్చేటట్లు కనిపిస్తోంది కాంగ్రెస్ అధిష్ఠానం. అంబికా సోని పేరు తాజాగా ప్రచారంలోకి వచ్చింది. ఆమెకు ముఖ్యమంత్రిగా నియమితులవుతారని అంటున్నారు. అంబికా సోని కేంద్ర మంత్రిగా పనిచేశారు. గాంధీ కుటుంబానికి వీర విధేయురాలిగా పేరుంది ఆమెకు. 1969లో ఇందిరాగాంధీ ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. పార్టీలో చేర్చుకున్నారు. అంబికా సోని స్వస్థలం హోషియాపూర్ ఆమె. ఆమె తండ్రి ఐఎఎస్ అధికారి.
గాంధీ కుటుంబానికి
పార్టీకి గానీ, గాంధీ కుటుంబానికి గానీ ఏనాడూ ఆమె ఎదురు తిరిగిన సందర్భాలు లేవు. వరుసగా రాజ్యసభకు నామినేట్ అవుతూ వచ్చారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేకపోయారు. ఆనంద్పూర్ సాహిబ్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చవి చూశారు. పార్టీకి, గాంధీ కుటుంబానికీ దశాబ్దాల కాలం నుంచి విధేయురాలిగా ఉండటం, దేశ రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉండటం వల్ల అంబికా సోనికి ముఖ్యమంత్రి పగ్గాలను అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంటోంది.