డిగ్గీరాజా వెరైటీ: ట్వీట్లు లేకుండా రాజకీయతీతంగా పాదయాత్ర.. జ్యోతిరాదిత్య ‘చేతి’కే పగ్గాలు!
2003 నుంచి మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉన్నది. అందునా 12 ఏళ్లుగా శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలో బీజేపీ బలోపేతమైంది.
భోపాల్: మధ్యప్రదేశ్లో అధికారాన్ని కైవశం చేసుకునే దిశగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు 14 నెలల ముందు నుంచే మరోవైపు పార్టీలో నాయకత్వం కోసం అంతర్గత పోరు సాగుతోంది. మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్, యువ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా, ట్రబుల్ షూటర్ కమల్నాథ్ పోటీ పడుతున్నా.. అధిష్ఠానం సింధియా వైపే మొగ్గుతోంది. గతంలో దశాబ్ద కాలం పాటు సీఎంగా ఉన్న డిగ్గీరాజా, చివరి అవకాశంగా కమలనాథ్ పెట్టుకున్న ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు.
తాను బలమైన సీఎం అభ్యర్థిని కాదంటూనే మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ శనివారం ద్వారాకా పీఠాధిపతి శంకరాచార్య స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీర్వాదంతో 'నర్మదా యాత్ర' పేరుతో పాదయాత్ర చేపట్టారు. మధ్యప్రదేశ్లో మొత్తం 3,300 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు. పదునైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. ఆరు నెలల పాటు ట్విటర్కు గుడ్బై చెప్పనున్నట్టు తెలిపారు. తాను ఈ కాలంలో కేవలం సమాధానాలు మాత్రమే ఇస్తానని స్పష్టం చేశారు.
యాత్ర సాగే ఆరు నెలల పాటు రాజకీయాలు మాట్లాడబోనని ప్రతీనబూనారు. నదులు, సాగునీటి ప్రాజెక్టులన్నీ చుట్టి వచ్చి వాటిలో జరుగుతున్న అవినీతిని ప్రజలకు తెలియజెప్పాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్కు జాతీయ రాజకీయాల్లోనూ మంచి అనుభవం ఉంది. అయితే ఇటీవల తగ్గుతున్న ప్రాభవం మళ్లీ పుంజుకునేందుకు ఆయన నర్మదా యాత్ర చేపట్టినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నర్మదా నది పొడవునా పాదయాత్ర చేస్తున్న దిగ్విజయ్ మొత్తం 110 అసెంబ్లీ స్థానాలతో పాటు గుజరాత్లోని 20 అసెంబ్లీ స్థానాలను కూడా చుట్టి వస్తారు. కాగా కొద్ది నెలల్లో మధ్యప్రదేవ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం దిగ్విజయ్ ఈ యాత్ర చేపట్టారని బీజేపీ విమర్శిస్తోంది.
బీజేపీ వ్యతిరేకతపైనే కాంగ్రెస్ పార్టీ ఆశలు
2003 నుంచి వరుసగా మూడు పర్యాయాలు అధికారం చేపట్టిన బీజేపీపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఇది తమకు లాభిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ఏడాది జూన్లో మందసౌర్లో పోలీసు కాల్పుల్లో ఐదుగురు రైతులు చనిపోవడం, గిట్టుబాటు ధరలు లేకపోవడం తదితర కారణాల వల్ల రైతాంగం బీజేపీపై ఆగ్రహంగా ఉంది. వీటన్నింటినీ దష్టిలో పెట్టుకొని ఐకమత్యంగా ముందుకు సాగితే విజయం సాధించగలమని కాంగ్రెస్ అధిష్టానం అంచనా వేస్తోంది. అందుకే పార్టీలోని వైరివర్గాలను ఏకతాటి పైకి తేవాలని చూస్తోంది.
కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ హై కమాండ్ ఇలా
సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా వర్గపోరుతో పార్టీ ప్రయోజనాలు దెబ్బతింటాయని తొలుత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భావించారు. అయితే దాదాపు 12 ఏళ్లుగా సీఎంగా కొనసాగుతున్న శివరాజ్సింగ్ చౌహన్ను ఎదుర్కొనాలంటే సీఎం అభ్యర్థిని ప్రకటించాల్సిందేనని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా కోరుతున్నాయి. పంజాబ్లో అమరీందర్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి విజయం సాధించడం కూడా కాంగ్రెస్ను పునరాలోచనలో పడేసింది. ఈ ఏడాది జూన్లో సోనియాగాంధీని కలిసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అగ్రనేతలు కమల్నాథ్, దిగ్విజయ్సింగ్, జ్యోతిరాదిత్య సింధియా.. ఎవరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించినా కలిసి పనిచేస్తామని, వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టి పార్టీ విజయం కోసం శ్రమిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల కాంగ్రెస్ ఏ కార్యక్రమం చేపట్టినా అగ్రనేతలందరూ హాజరవుతున్నారు. 1993 ఎన్నికలకు ముందు గ్వాలియర్కు సమీపంలోని దాబ్రాలో మాట్లాడుతూ కాంగ్రెస్లోని వర్గాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపిచ్చారు. అప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పదేళ్లు రాష్ట్రాన్ని పాలించింది. ఇప్పుడలాగే 'దాబ్రా స్ఫూర్తి'తో ముందుసాగాలని కాంగ్రెస్ భావిస్తోంది.
యువ ఎంపీ జ్యోతిరాదిత్య వైపే మొగ్గు
మధ్యప్రదేశ్ సీఎం అభ్యర్థిగా పోటీ ప్రధానంగా ఇద్దరు నేతలు కమల్నాథ్, జ్యోతిరాదిత్య సింధియా మధ్యే ఉంది. గ్వాలియర్ రాజవంశానికి చెందిన 46 ఏళ్ల జ్యోతిరాదిత్య వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతోంది. దివంగత మాధవరావు సింధియా కుమారుడైన జ్యోతిరాదిత్య చరిష్మా కలిగిన నాయకుడు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీకి అత్యంత సన్నిహితుడు. యువతరాన్ని ప్రోత్సహించాలని గట్టిగా వాదించే రాహుల్... జనాదరణను కూడా దష్టిలో పెట్టుకొని జ్యోతిరాదిత్యకే పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం లేదని కొంతకాలం కిందటివరకు వాదించిన కమల్నాథ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ 'సింధియాజీని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి. ఆయన నాయకత్వంలో పని చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు' అని అన్నారు. జ్యోతిరాదిత్య సింధియా చేతికి పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధమైపోయిందనేందుకు కమల్నాథ్ వ్యాఖ్యలు సంకేతమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాను సీఎం అభ్యర్థి రేసు నుంచి వైదొలుగుతున్నట్లు కమల్నాథ్ పరోక్షంగా వెల్లడించారని భావిస్తున్నారు. దసరా తర్వాత కాంగ్రెస్ ఈ మేరకు ప్రకటన చేయవచ్చని, లేదా రాహుల్గాంధీ కాంగ్రెస్ అధ్యక్షబాధ్యతలు చేపట్టాక జ్యోతిరాదిత్య పేరును ప్రకటించొచ్చని ప్రచారం జరుగుతోంది.
ఆఖరి
ఛాన్స్
కోసం
ఆశపడ్డ
కమల్నాథ్
నిజానికి కమల్నాథ్ తాను సీఎం అభ్యర్థి కావాలని గట్టిగానే కోరుకున్నారు. చాన్నాళ్లుగా మధ్రప్రదేశ్ను చుట్టేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచనలు భిన్నంగా ఉన్నాయని తెలియడం, మరోవైపు దిగ్విజయ్ తెరపైకి వచ్చే యత్నాలు చేస్తుండటంతో కమల్నాథ్ బాహటంగా జ్యోతిరాదిత్యకు మద్దతు ప్రకటించారు. కమల్నాథ్ సీనియర్ పార్లమెంటేరియన్. మధ్యప్రదేశ్లోని చింద్వారా నియోజకవర్గం నుంచి వరుసగా తొమ్మిదోసారి లోక్సభకు ఎన్నికయ్యారు. పీవీ నరసింహారావు క్యాబినెట్లో సహాయమంత్రిగా పనిచేసిన కమల్నాథ్.. 2004 నుంచి 2014 కేంద్ర వాణిజ్య, ఉపరితల రవాణా, పట్టణాభివద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ మంత్రిగా పదేళ్లు వివిధ బాధ్యతలు చూశారు. ఇప్పుడు కమలనాథ్కు 70 ఏళ్లు. జ్యోతిరాదిత్య యువకుడు కాబట్టి ఆయనకు భవిష్యత్లో అవకాశాలు వస్తాయని... ఇప్పుడు తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కమల్నాథ్ కోరుకున్నారు. ఈయనకు కాంగ్రెస్లో ట్రబుల్ షూటర్గానూ పేరుంది. కాంగ్రెస్కు ఆర్థిక వనరులను సమీకరించడంలోనూ ఈయనదే కీలకపాత్ర. బహుశా జనాదరణలో శివరాజ్సింగ్ చౌహాన్కు సరితూగలేరనేది కాంగ్రెస్ పెద్దల అభిప్రాయం కావొచ్చు. అదికాకుండా జ్యోతిరాదిత్యకు రాహుల్తో ఉన్న సాన్నిహిత్యం కూడా ఈ వెటరన్ను సీఎం అభ్యర్థి రేసులో వెనక్కినెట్టింది.
ఉనికి చాటే యత్నంలో డిగ్గీ రాజా
1993 నుంచి 2003 దాకా మధ్యప్రదేశ్ సీఎంగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్ తర్వాత కేంద్రానికి మారారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పలు రాష్ట్రాల ఇంఛార్జిగా పనిచేశారు. రాహుల్కు రాజకీయ పాఠాలు బోధించారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తదితర కారణాలతో దిగ్విజయ్ బాధ్యతలను అధిష్టానం క్రమేపీ తగ్గిస్తూ వస్తోంది. ఈ ఏడాది మార్చిలో గోవాలో జరిగిన ఎన్నికల్లో 40 సీట్లకు కాంగ్రెస్ 17 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే మరో నలుగురు ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టడంలో ఆయన విఫలమయ్యారని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 29న ఆయనను గోవా, కర్ణాటక రాష్ట్రాల ఇంచార్జి పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్న ఏఐసీసీ.. ఆగష్టు ఒకటిన తెలంగాణ ఇంచార్జి పదవి నుంచి కూడా తొలగించింది. పదేళ్లు సీఎంగా పనిచేసిన డిగ్గీరాజాకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో మంచి పట్టే ఉంది. తనను అంత తేలికగా తీసిపారేయడానికి వీలులేదని సంకేతాలు పంపుతూ ఉనికిని చాటుకునేందుకు దిగ్విజయ్ నర్మదా నది పరివాహక ప్రాంతంలో 'నర్మదా పరిక్రమ' పేరిట 3,400 కిలోమీటర్ల పాదయాత్రను ఈనెల 30న మొదలుపెట్టారు. సుమారు 100 అసెంబ్లీ స్థానాల మీదుగా సాగే ఈ పాదయాత్రలో దిగ్విజయ్ జనం వద్దకే వెళ్లి వాళ్లతో మాట్లాడనున్నారు. ఎప్పుడో కొన్నేళ్ల కిందట సంకల్పించినా, ఇప్పటికి చేపట్టగలిగానని దిగ్విజయ్ చెబుతున్నా... కాంగ్రెస్ పార్టీకి ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మరోవైపు దిగ్విజయ్కి తన ఉనికిని చాటేందుకు పనికి వస్తుంది. 'నేను సీఎం పదవికి రేసులో లేను... నేనిప్పుడు బలమైన బలమైన అభ్యర్థిని కాను' అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. సీఎం అభ్యర్థి ఎవరనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని తేల్చేశారు.