లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం అఘోరాలు, హఠయోగులతో పూజలు
భోపాల్: లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న నాయకులు అనేక మార్గాలను వెదుకుతుంటారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి అనేక వేషాలు వేస్తారు. నానా అగచాట్లు పడతారు. గట్టి పోటీ ఎదురైతే కొమ్ములు తిరిగిన నాయకులూ బెంబేలెత్తుతారనడం సందేహాలు అనవసరం. తాజాగా- కాకలు తీరిన కాంగ్రెస్ యోధుడు దిగ్విజయ్ సింగ్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా చక్రం తిప్పిన డిగ్గీరాజాకు లోక్సభ ఎన్నికల్లో సాధ్వి ప్రగ్యాసింగ్ ఠాకూర్ రూపంలో గట్టి పోటీ ఎదురైంది.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భోపాల్ లోక్సభ నుంచి ఎన్నికల బరిలో నిల్చున్న ఆయనపై బీజేపీ వివాదాస్పద సాధ్వీని పోటీకి నిలిపింది. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో సుమారు ఎనిమిదేళ్ల పాటు కారాగారాన్ని అనుభవించి, ఇటీవలే విడుదలైన సాధ్వి ప్రగ్యాసింగ్ను అభ్యర్థిగి నిలిపింది బీజేపీ. ఆమె అభ్యర్థిత్వంతో దిగ్విజయ్ సింగ్లో కలవరం మొదలైనట్లు చెబుతున్నారు. దీనితో ఆయన ఓటర్లను ఆకట్టుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులనూ ఉపయోగించుకుంటున్నారు.
పూజలు ఫలిస్తాయా?
ఇందులో భాగంగా- సాధువులను కూడా దిగ్విజయ్ సింగ్ ఆశ్రయించారు. వారితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. శాంతి హోమాలను జరిపించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.మధ్యప్రదేశ్కు చెందిన ప్రముఖ సాధువు కంప్యూటర్ బాబా కొంతకాలంగా భోపాల్లో హఠయోగ శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాలకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో హఠయోగులు, అఘోరాలు హాజరయ్యారు. ఈ శిక్షణా శిబిరాన్ని దిగ్విజయ్ సింగ్ తన భార్యతో కలిసి మంగళవారం ఉదయం సందర్శించారు. కంప్యూటర్ బాబాను దర్శించి, ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా హఠయోగ శిక్షణా శిబిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో డిగ్గీరాజా పాల్గొన్నారు. హోమాలను జరిపించారు.
కంప్యూటర్ బాబాకు మంత్రి హోదా
నిజానికి కంప్యూటర్ బాబాకు భారతీయ జనతాపార్టీ సానుభూతిపరునిగా పేరుంది. బీజేపీకి చెందిన పెద్ద తలకాయలతో ఆయన సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మొదలుకుని మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరకు దాదాపు అందరు నాయకులు కంప్యూటర్ బాబా ఆశీర్వాదాన్ని తీసుకున్న వారే. బీజేపీతో కంప్యూటర్ బాబాకు ఉన్న సాన్నిహిత్యం ఎంత వరకు వెళ్లిందంటే- శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు క్యాబినెట్ మంత్రి హోదాను కల్పించారు. క్యాబినెట్ మంత్రులకు లభించే అన్ని వసతులనూ కంప్యూటర్ బాబాకు వర్తింపజేశారు. అలాంటి సాధువును దిగ్విజయ్ సింగ్ కలుసుకోవడం, ఆశీర్వాదాన్ని తీసుకోవడం, హోమాలను జరిపించడాన్ని బట్టి చూస్తే..గెలుపు కోసం పక్కా వ్యూహాన్ని పన్నినట్టు తెలుస్తోంది.
బీజేపీకి కంచుకోట..
భోపాల్ లోక్సభ స్థానం బీజేపీకి కంచుకోట. 1989 నుంచి 2014 వరకు జరిగిన అన్ని లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు జెండా పాతారు. కేంద్ర మాజీమంత్రి ఉమా భారతి కూడా ఈ స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. సుశీల్ చంద్ర వర్మ అత్యధికంగా నాలుగుసార్లు ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున గెలిచారు. 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున అలోక్ సంజర్ పోటీ చేసి, విజయం సాధించారు. ఈ సారి అభ్యర్థిని మార్చింది బీజేపీ. అలోక్కు మరోసారి టికెట్ ఇవ్వలేదు. వ్యూహాత్మకంగా సాధ్వి ప్రగ్యాసింగ్ ఠాకూర్ను బరిలో దింపింది.