మొన్న అజాంఖాన్ బర్రెలు ఘటన, నేడు మేక చోరీ
లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీసులకు వింతగా ఉండే బాధ్యతలు మీద పడుతుంటాయి. గతంలో ఆ రాష్ట్ర మంత్రి అజాం కాన్ బర్రెలు పోతే, క్షణాల్లో రంగంలోకి దిగిన పోలీసులు వాటిని వెతికి పట్టుకున్నారు. ఇప్పడు తాజాగా అలీగఢ్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకురాలు నఫీసా షహీన్ ముద్దుల మేక చోరీకి గురైంది.
అది కనిపించకపోవడంతో కంగారుపడ్డ షహీన్ వెనువెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మేక ఆచూకీ కనుగొనేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. త్వరలోనే మేక దొంగను పట్టుకొని మేకను షహీన్కు అప్పగిస్తామని అలీగఢ్ ఏసీపీ బ్రజేశ్ కుమార్ తెలిపారు.
మంత్రి అజాం ఖాన్కి చెందిన గేదెలు కనిపించకుండా పోయినప్పుడు ముగ్గురు పోలీసులను ఉద్యోగాల నుంచి సస్పెండ్ కూడా చేశారు. దీంతో అత్యున్నత స్థాయిలో పోలీసు బృందాలు వేట సాగించి పోయిన గేదెల దొంగను, గేదేలను ఆ తర్వాత పట్టుకున్నారనుకోండి.
ఉగ్రవాదులను వేటాడిన తరహాలో సీనియర్ పోలీసు అధికారులు, స్నిఫర్ డాగ్స్ తో జరిపిన ఈ సెర్చ్ ప్రోగ్రామ్ ఉత్తరప్రదేశ్లో అప్పట్లో సంచలనం సృష్టించింది.