అజిత్ దోవల్ కుమారుడికి కాంగ్రెస్ సీనియర్ నేత క్షమాపణలు... కారణమిదే...
కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కుమారుడు వివేక్ దోవల్కి క్షమాపణలు చెప్పారు.జైరాం రమేశ్ క్షమాపణను అంగీకరించిన వివేక్ దోవల్ పరువు నష్టం కేసు నుంచి ఆయన పేరును ఉపసంహరించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో జైరాం రమేశ్పై గతేడాది జనవరిలో వివేక్ దోవల్ ఢిల్లీ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. జాతీయ స్థాయిలో ఉన్నత స్థానంలో ఉన్న తన తండ్రిని అపఖ్యాతి పాలు చేసేందుకు జైరాం రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారని వివేక్ దోవల్ తన పిటిషన్లో పేర్కొన్నారు.
జైరాం రమేశ్తో పాటు కారవాన్ మేగజైన్పై వివేక్ దోవల్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. కారవాన్ మేగజైన్లో 'ది డి కంపెనీస్' శీర్షికతో ప్రచురితమైన కథనంలో వివేక్ దోవల్పై పలు ఆరోపణలు చేశారు. ఆ కంపెనీలతో వివేక్ దోవల్కు సంబంధాలున్నట్లు ఆరోపించారు. ఈ కథనం ఆధారంగా జైరాం రమేశ్ పలుమార్లు ప్రెస్ మీట్స్ పెట్టి వివేక్ దోవల్పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన వివేక్ దోవల్...జైరాం రమేశ్తో పాటు ఆ కథనాన్ని ప్రచురించిన కారవాన్ మేగజైన్ ఎడిటర్-ఇన్-చీఫ్ పరేష్ నాథ్,రిపోర్టర్ కౌశల్ ష్రాఫ్లపై పరువు నష్టం దావా వేశారు.
ఈ నేపథ్యంలో తాజాగా జైరాం రమేశ్ వివేక్ దోవల్పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని... ఆ వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెబుతున్నానని తెలియజేశారు. 'వివేక్ దోవల్తో పాటు ఆయన తండ్రి అజిత్ దోవల్పై క్షణికావేశంలో ఆరోపణలు చేశాను. పైగా అది ఎన్నికల సమయం కూడా. ఆ కథనాన్ని ధ్రువీకరించకోకుండానే దోవల్ కుటుంబ సభ్యుల గురించి, వ్యాపారాల గురించి మాట్లాడాను. అందుకే క్షమాపణలు చెబుతున్నాను.' అని జైరాం రమేష్ వెల్లడించారు.
గతంలో వివేక్ దోవల్,ఆయన కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ప్రకటనలు ఏవైనా కాంగ్రెస్ అధికారిక వెబ్సైట్లో ఉంటే వెంటనే వాటిని తొలగించాలని కోరుతున్నట్లు చెప్పారు. క్షమాపణలతో జైరాం రమేశ్ ఈ కేసు నుంచి బయటపడగా... కారవాన్ మేగజైన్పై మాత్రం పరువు నష్టం కేసు కొనసాగనుంది.