కాంగ్రెస్ కు జ్యోతిరాదిత్య సింధియా గుడ్ బై?.. ట్విట్టర్ లో ఐడెంటిటీ తొలగింపు
భోపాల్: కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయులై కుటుంబాల్లో ఒకటి సింధియా ఫ్యామిలీ. ఆవిర్భావం నుంచీ కాంగ్రెస్ లోనే కొనసాగుతూ వస్తోన్న కుటుంబం అది. అలాంటి కుటుంబం కాంగ్రెస్ కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే అవుననే చెప్పుకోవాల్సి వస్తోంది. మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.
దీనికి కారణం జ్యోతిరాదిత్య సింధియా వ్యవహార శైలి. తన ట్విట్టర్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఐడెంటిటీని ఆయన తొలగించారు. ఇదివరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కేంద్ర మాజీమంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా ఐడెంటిటీ ఉండేది. సోమవారం ఉదయం ఆయన వాటిని తొలగించారు. పబ్లిక్ సర్వెంట్, క్రికెట్ ఎంథూసియాస్ట్ గా మాత్రమే తనను పేర్కొన్నారు. ఇది కాస్తా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో అనేక అనుమానాలకు తెర తీసింది. చర్చనీయాంశమైంది.
కాంగ్రెస్ పార్టీ విధేయుల్లో ఒకరైన దివంగత నాయకుడు మాధవరావు సింధియా వారసుడిగా జ్యోతిరాదిత్య రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. మధ్యప్రదేశ్ లోని గుణ-శివ్ పురి లోక్ సభ స్థానం నుంచి ఓటమి అనేదే లేకుండా విజయం సాధిస్తూ వచ్చారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో తొలిసారిగా పరాజయాన్ని చవి చూశారు. భారతీయ జనతాపార్టీకి చెందిన కృష్ణపాల్ సింగ్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. అదే సమయంలో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. జ్యోతిరాదిత్య సింధియా పెద్దగా క్రియాశీలకంగా ఉండట్లేదు.
పార్టీ సీనియర్ నాయకుడు కమల్ నాథ్ ను ముఖ్యమంత్రిగా నియమించిన తరువాత కాంగ్రెస్ తో మరింత దూరాన్ని పాటిస్తూ వచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కమల్ నాథ్ ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించడాన్ని ఆయన బాహటంగానే తప్పు పట్టారు. కమల్ నాథ్ పేరును కాంగ్రెస్ పార్టీ పరిశీలనలోకి తీసుకోకపోతే.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా జ్యోతిరాదిత్య ప్రమాణ స్వీకారం చేసేవారే.
మరోవంక- జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తరువాత.. బీజేపీకి అనుకూలంగా జ్యోతిరాదిత్య సింధియా ఒకట్రెండు సార్లు ప్రకటనలు చేశారు. దీనిపై అప్పట్లో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు షోకాజ్ నోటీసులను సైతం జారీ చేశారు. ఈ వ్యవహారాలతో విసిగిపోయిన జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడానికి సిద్ధమయ్యారనే వార్తలు ఒక్కసారిగా మధ్యప్రదేశ్ లో గుప్పుమంటున్నాయి.
దీనికితోడు- ట్విట్టర్ లో తన కాంగ్రెస్ ఐడెంటిటీని తొలగించడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని కలిగిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. కాంగ్రెస్ ను బయటికి రావడమంటూ జరిగితే.. ప్రత్యామ్నాయంగా బీజేపీలో చేరొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. బీజేపీ సీనియర్ నాయకురాలు, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి విజయరాజె సింధియా.. స్వయంగా జ్యోతిరాదిత్య సింధియాకు మేనత్త కావడం కలిసి వస్తోందని అంటున్నారు.