బీజేపీ ఎంపీలకే బడ్జెట్ అర్థంకాలేదు.. నా రేటింగ్ 1 నుంచి 0: చిదంబరం సంచలన కామెంట్లు
స్వతంత్రభారత చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన నిర్మలా సీతారమన్ బడ్జెట్ ప్రసంగం.. చాలా చప్పగా, నీరసంగా సాగిందని, 160 నిమిషాల ప్రసంగం విని దేశ ప్రజలంతా నీరసించిపోయారని, అసలు ఆర్థిక మంత్రి ఏం మాట్లాడారో, దేశానికి ఎలాంటి దిశచూపాలనుకున్నారో హార్డ్ కోర్ బీజేపీ ఎంపీలకు కూడా అర్థంకాలేదని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎంపీ పి.చిదంబరం విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ పతనం చెందుతోందన్న వాస్తవాన్ని గుర్తించడానికి మోదీ సర్కార్ సిద్ధంగా లేదన్న విషయం మరోసారి అర్థమైందన్నారు. పార్లమెంట్ లో నిర్మల సీతారమన్ బడ్జెట్ ప్రసంగం తర్వాత ఏఐసీసీ ఆఫీసులో చిదంబరం రియాక్షన్ ఆయన మాటల్లోనే...
ఒక్క స్టేట్ మెంటైనా గుర్తుందా?
‘‘బడ్జెట్ రోజు ఆర్థిక మంత్రులు చెప్పే మాటల్లో కనీసం ఒక్కవాక్యాన్నైనా అందరూ నోటీస్ చేస్తారు. కానీ నిర్మల రెండున్నర గంటల ప్రసంగంలో ఒక్కటంటే ఒక్కస్టేట్మెంట్ కూడా గుర్తుపెట్టుకునేంత స్థాయిలో లేనేలేదు. ఆవిడేం మెసేజ్ ఇవ్వాలనుకున్నారో ఎవరికీ అర్థంకాలేదు. ఆర్థిక వ్యవస్థను బాగుచేయాలనిగానీ, జీడీపీని గాడిలో పెట్టాలనిగానీ, ప్రైవేటు పెట్టుబడులు, ఉత్పాదకత, ఉపాధిని పెంపొందించాలనిగానీ, ప్రపంచ మార్కెట్ లో గట్టిపోటీదారుగా నిలవాలన్న సోయిగానీ ఈ బడ్జెట్ లో లేనేలేదు.
ఫెయిలైన పథకాలతో ఎలా పాసవుతాం?
మోదీ సర్కార్ గత, వర్తమాన పథకాలనే అటుఇటు మార్చి రకరకాల థీమ్స్, సెగ్మెంట్లుగా విభజిస్తూ నిర్మల చేసిన ప్రసంగం.. కనీసం బీజేపీ ఎంపీలకు కూడా అర్థమైఉండదు. పాపం ప్రజలకు ఏం చెప్పాలా.. అనే కన్ఫ్యూజన్ లో బీజేపీవాళ్లు పడిపోయారు. ఒక ఓటు అడగటానికి కూడా ఈ బడ్జెట్ పనికిరాదు. ఇప్పటికే దారుణంగా ఫెయిలైన పథకాలను యధావిధిగా కొనసాగిస్తూ కొత్త టార్గెట్లను ఎలా సాధిస్తారో అర్థంకావడంలేదు. రక్షణాత్మక విధానం, పన్నుల బాదుడు, విత్త నియంత్రణపై దూకుడుగా వ్యవహరిస్తోన్న బీజేపీ ప్రభుత్వం.. మార్కెట్ ఎకానమీ, పోటీతత్వం, ట్రేడ్ ఇటెన్సిటీపై ఫోకస్ పెట్టలేదు. రోజురోజుకూ దిగజారుతోన్న ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టే ఒక్క అంశం కూడా బడ్జెట్ లో లేదు. గత బడ్జెట్ లో చెప్పిన టార్గెట్లను సాధించలేదు. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ వైఫల్యం తప్పదు.
మునగడం ఖాయం
కొంతకాలంగా ఇండియాకు విదేశీ పెట్టుబడుల రాక నిలిచిపోయిందన్నది వందశాతం వాస్తవం. ఆర్థిక మంత్రి నిర్మల దీన్ని కనీసమాత్రంగానైనా పట్టించుకోలేదు. రేప్పొద్దున ఆయిల్ క్రైసిస్ తలెత్తి, ప్రపంచ ఎకానమీ పడిపోతే.. దేశాన్ని ఎలా కాపాడుకోవాలో బీజేపీ దగ్గర ప్లాన్ లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కోట్లమంది పేద, మధ్యతరగతి ఇబ్బందులలు తప్పవు. ఆర్థిక వ్యవస్థ మునడం ఖాయం. దేశానికి దశ-దిశ చూపడంలో ఆర్థిక మంత్రి ఘోరంగా ఫెయిలయ్యారు. ఆర్థిక సంస్కరణల అవసరాన్ని గుర్తించడానికి కేంద్రం సిద్ధంగా లేదు.
ఎల్ఐసీపై చర్చిస్తాం..
లాభాల్లో ఉన్న పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ చాలా ప్రమాదకరమైన నిర్ణయం. ప్రైవేటు భీమా కంపెనీలకు ధీటుగా పనిచేస్తున్న ఎల్ఐసీకి ఈ నిర్ణయం నష్టదాయకమే అవుతుంది. అయితే దీనిపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరముంది. ఎల్ఐసీపై మేం పార్లమెంట్ తో తప్పకుండా మాట్లాడుతాం''అని చిదంబరం చెప్పారు.
రేటింగ్ తప్పదా?
ఆర్థిక సర్వే 6 నుంచి 6.5 శాతంగా ఉంటుందన్న జీడీపీని.. కేంద్ర బడ్జెట్ లో మాత్రం 10 శాతంగా పెంచిచూపడంపై చిదంబరం సెటైర్లు వేశారు. నిర్మల సీతారామన్ బడ్జెట్ కు మీరు ఎంత రేటింగ్ ఇస్తారన్న విలేకరుల ప్రశ్నలకు ఆయన తడుముకోకుండా. ‘‘1 నుంచి 0 వరకు ఇస్తాను''అని బదులిచ్చారు. బడ్జెట్ ద్వారా ఎవరికైనా మేలు జరిగితే దానిని కాంగ్రెస్ ఆహ్వానిస్తుందని చెప్పారు.