ఏడాదిలో 359 రోజులు కర్ఫ్యూ.. వారణాసి పరిస్థితిపై మోదీని టార్గెట్ చేసిన ప్రియాంక
బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో గతేడాది ఏకంగా 359 రోజులపాటు 144 సెక్షన్ విధించడమే అందుకు ఉదాహరణ అని చెప్పారు. ప్రధాని నియోజకవర్గంలోనే ఇలా ఉంటే, మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించొచ్చన్నారు.
''వారణాసిలో గతేడాది 365 రోజులకుగానూ 359 రోజులు సెక్షన్ 144 అమల్లో ఉన్నా.. ప్రధాని మాత్రం.. ప్రజలు భయపడాల్సిన పనిలేదని, దేశం సమర్థుల చేతుల్లో సురక్షతంగా ఉందని ఎలా చెబుతారో అర్థం కావడంలేదు. తన సొంత నియోజకవర్గంలోనే ఏడాది పొడవునా నిషేధాజ్ఞలు అమలవుతుంటే ఇక మిగతా ప్రాంతాల ప్రజలకు మోదీ భరోసా ఇస్తారంటే నమ్మగలమా?''అని ప్రియాంక ఎద్దేవా చేశారు.
రామజన్మభూమిపై సుప్రీంకోర్టు తీర్పు, సీఏఏ వ్యతిరేక నిరసనలు, ఎన్ఆర్సీపై ఆందోళనలు తదితర ఘటనలన నేపథ్యంలో గతేడాది 359 రోజుల పాటు వారణాసిలో 144 సెక్షన్ అమలైందంటూ బెనారస్ హిందూ యూనివర్సిటీ కి చెందిన ఓ విద్యార్థి చెప్పిన విషయాన్ని ప్రియాంక తన ట్వీట్ లో పొందుపర్చారు.