శివసేనతో పొత్తు నచ్చట్లే: రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం..! ఎక్కడికి దారి తీస్తుందో..?
ముంబై: మహారాష్ట్రలో ఇంకా ప్రభుత్వం ఏర్పాటే కాలేదు. ముఖ్యమంత్రిగా ఎంపికైన శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. శివసేనతో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి ఇష్టం లేదా?, ఈ పరిణామం మహా వికాస్ అఘాడీ కూటమిలో పొరపచ్చాలకు బీజం వేస్తుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మతతత్వ పార్టీగా ముద్ర పడిన శివసేనతో పొత్తు పెట్టుకుని మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుండటం రాహుల్ గాంధీ ఎంత మాత్రమూ ఇష్టం లేదని తెలుస్తోంది.
సూర్యయాన్ సేఫ్ ల్యాండింగ్: బీజేపీ ఎద్దేవా..నెక్స్ట్ టార్గెట్ హస్తిన..చాణక్యుడిని కాను: రౌత్ సంచలనం
రాహుల్ గాంధీ డుమ్మా..
శివసేనతో చేతులు కలపడాన్ని ఆయన ముందు నుంచీ వ్యతిరేకిస్తూనే వస్తున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో- గురువారం శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గైర్హాజర్ కావాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, అహ్మద్ పటేల్, మల్లికార్జున ఖర్గే సహా పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ప్రమాణ స్వీకారోత్సవ ఆహ్వాన పత్రాలను పంపించారు.
సోనియా హాజరు కావడం ఖాయమేనంటోన్న పార్టీ..
ఆహ్వానం అందినప్పటికీ.. ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాకూడదని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. శివసేనతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదనే విషయాన్ని రాహుల్ గాంధీ ఈ రకంగా వ్యక్తం చేసినట్లు అవుతుందని అంటున్నారు. చివరి నిమిషంలో ఏవైనా అవంతారలు అడ్డొస్తే తప్ప.. సోనియాగాంధీ, ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడం ఖాయమైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ప్రియాంకా గాంధీ వాద్రా ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉందని తెలుస్తోంది.
శివాజీ పార్కులో
ఉద్ధవ్ థాకరే గురువారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ముంబైలోని శివాజీ పార్కులో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికోసం చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దీనికి అవసరమైన ఆహ్వాన పత్రాలను పంపించారు. వీఐపీ పాసులను జారీ చేశారు. థాకరే కుటుంబానికి చెందిన నాయకుడు తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందు వల్ల దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీన్ని గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా తిలకించలేని వారి కోసం స్టేడియం బయట, ముంబైలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు.